అమరావతి -విశాఖల్లో నెక్స్ట్ స్టెప్ ఇదే : తేల్చేసిన సీఎం జగన్ ..!
మూడు రాజధానుల వ్యవహారం పైన సీఎం జగన్ తేల్చి చెప్పారు అన్నీ ఆలోచించిన తరువాతనే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని స్పష్టం చేసారు. అదే సమయంలో సీఎం ఎక్కడి నుంచి అయినా పాలన చేయవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక ప్రముఖ జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. సీఎం ఎక్కడ నుంచి పాలన చేస్తే అక్కడే మంత్రులు ఉంటారని..అక్కేడ సచివాలయం ఉంటుందని తేల్చి చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పాలన చేయాలనే దాని పైన ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.
అమరావతి పై కోపం లేదు
ఆర్దిక అనుకూలత - పరిపాలనా సౌలభ్యం కోసమే విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేసామని వివరించారు. వికేంద్రీకరణ స్పూర్తిగా విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంచుకున్నామని చెప్పారు. అయిదు నుంచి పది వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుత రాజధానిగా మారుతుందన్నారు. తనకు అమరావతి మీద ఎటువంటి కోపం లేదని సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇష్టం లేకుంటే అమరావతిలో శాసన రాజధాని ఎందుకు ప్రకటిస్తామని, అక్కడే శాసన వ్యవస్థలు ఉంటాయని తేల్చి చెప్పారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని వెల్లడించారు. అమరావతి అటు గుంటూరు..ఇటు విజయవాడకు 40 కిలో మీటర్ల దూరంలో ఉందని, అక్కడ ఎటువంటి మౌళిక వసతులు లేవని గుర్తు చేసారు.

రియల్ ఎస్టేట్ ఆందోళన
ఎకరానికి ఏ స్థాయిలో ఖర్చు చేస్తే మౌళిక వసతులు ఏర్పడుతాయో గతంలోనే చంద్రబాబు వివరించారని, ఆ లెక్కన లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా పూర్తి స్థాయి రాజధానిగా చెందటం కష్టమని వివరించారు. అమరావతి రాజధానిగా ప్రకటనకు ముందే చంద్రబాబు మద్దతు దారులు, సన్నిహితులు భూములు కొనుగోలు చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని సీఎం ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. రాజధాని కోసం కాదని, రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మద్దతు దారులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసింది.

విశాఖ నుంచి పాలన దిశగా
రేపు సుప్రీంలో విచారణకు రానుంది. ఇదే సమయంలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని కొద్ది రోజులుగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు..ఇప్పుడు సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చంటూ చెబుతుండటంతో దీని పైన స్పష్టత వస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. సంక్రాంతి నుంచి విశాఖ కేంద్రంగానే పాలన ఉండే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications