సీఎం జగన్ కొత్త వ్యూహాలు : నవీన్ పట్నాయక్ ఆహ్వానం- సమావేశం ఫిక్స్ : అసలు అజెండా అదే..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండున్నారేళ్ల పాలన పూర్తి చేస్తన్న సమయంలో కొత్త అడుగులు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత తమ విధానం అని చెప్పిన సీఎం..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ సీఎంతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ సైతం ఏపీకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ, ఆ తరువాత ఇద్దరి మధ్య అటువంటి సమావేశాలు నిలిచిపోయాయి. అయితే, ఇప్పుడు ఏపీకి మరో సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న నీటి వివాదాలను పరిష్కరించుకోవటానికి అడుగులు పడుతున్నాయి.

నవీన్ పట్నాయక్ ఆహ్వానం...ఒడిశాకు సీఎం జగన్
ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్ ఈ నెల 9వ తేదీన భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. పోలవరం, జంఝావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతోపాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందులో రాజకీయ వ్యూహాలు ఉన్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

నీటి సమస్యలే ప్రధాన అజెండగా సమావేశం
జంఝావతిపై కాంక్రీట్ డ్యామ్..అంశం పైన సీఎం జగన్ చర్చించనున్నారు. ఇందు కోసం ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కార్ను ఒప్పించడం ద్వారా రబ్బర్ డ్యామ్ స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్ డ్యామ్ను నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది.

వంశధార ట్రిబ్యునల్ ఉత్తర్వులపైనా
ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో రెండు పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు. రెండు రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్ జగన్ ఈ పర్యటనలో ఒడిశా సీఎంతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్ 3న అంతర్రాష్ట్ర సమావేశంలో ఒడిశా, ఛత్తీస్గఢ్ కోరాయి.

ముంపు ప్రాంతాల పునరావాసం పైనా చర్చ
ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కి.మీ, శబరిపై 18.2 కి.మీ. వెరసి 30.2 కి.మీ. పొడవున సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం రూ.378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగరి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది.

పోలవరం నీటి నిల్వపైన ప్రధాన ఫోకస్
దీంతో..గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ చర్చించనున్నారు.

రాజకీయంగానూ జగన్ - నవీన్ భేటీ పైన ఆసక్తి
ఇక, జాతీయ రాజకీయాల్లో భాగంగా...ఇప్పుడు నవీన్ పట్నాయక్ అటు కాంగ్రెస్ ...ఇటు బీజేపి కూటమిలకు దూరంగా ఉంటున్నారు. జగన్ - కేసీఆర్ సైతం అదే విధంగా కనిపిస్తున్నా.. అవసరమైన సమయంల ముగ్గురు ముఖ్యమంత్రులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు మద్దతిస్తున్నారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా... తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా ఒడిశా ముఖ్యమంత్రి కీలకం కానున్నారు. దీంతో..జగన్ నీటి వివాదాల పరిష్కారంతో పాటుగా..రాజకీయంగానూ ఒడిశా సీఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి..ఇద్దరు సీఎం లు తమ రాష్ట్రాల అధికారులతో ఈ నెల 9న నిర్వహిస్తున్న ఈ సమావేశం ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications