ఆ వైద్యురాలికి వేధింపులు.. డా.సుధాకర్ తరహాలోనే.. సీఎం జగన్ సంచలన నిర్ణయం..
దళిత డాక్టర్ సుధాకర్ వివాదం ఇంకా సద్దుమణగముందే ఆంధ్రప్రదేశ్లో మరో దళిత వైద్యురాలి వివాదం తెర పైకి వచ్చింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో ఫిజీషియన్గా పనిచేస్తున్న అనితా రాణి అనే వైద్యురాలు తనను వైసీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఇటీవల ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆమె ఆవేదనకు సంబంధించిన ఓ ఆడియో టేపును రెండు రోజుల క్రితం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మీరు అమలుచేస్తున్న దిశ చట్టం దారి తప్పిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. తాజాగా ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు.

అనితా రాణి ఆరోపణలు
ఆసుపత్రిలో అక్రమ అబార్షన్లు వంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని.. తాను నిజాయితీగా పనిచేస్తున్నందుకే తనపై స్థానిక వైసీపీ నేతలు కక్ష కట్టారని అనితా రాణి ఆరోపిస్తున్నారు. నారా లోకేష్ బయటపెట్టిన ఆడియో టేపులో ఆమె తన ఆవేదనంతా బయటపెట్టారు. ఒక సాధారణ స్థాయి నుంచి బాగా చదువుకుని గోల్డ్ మెడల్ సాధించి వైద్య వృత్తిలోకి వచ్చానని చెప్పారు. అంతేకాదు,ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు వచ్చిన అమెరికా ఆఫర్ను వదులుకుని మరీ రూరల్ సర్వీస్ చేస్తున్నట్టు తెలిపారు. అలాంటి తనపై వేధింపులకు పాల్పడటం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు.

ట్విట్టర్లో ప్రభుత్వాన్ని నిలదీసిన లోకేష్
డా.సుధాకర్కు జరిగినట్టే తనకూ అవమానాలు,వేధింపులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఆఖరికి తాను వాష్ రూమ్లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు,వీడియోలు తీసి తన పట్ల బెదిరింపులకు పాల్పడుతున్నారని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం నారా లోకేష్ తన ట్విట్టర్లో స్పందిస్తూ.. 'రాజారెడ్డి రాజ్యాంగంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీ నేతల అవినీతికి సహకరించలేదని దళిత మహిళా డాక్టర్ను వేధించడం దారుణం' అని వ్యాఖ్యానించారు. దిశ చట్టం దారి తప్పిందా.. నిందితులకే కొమ్ముకాస్తున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనితా రాణిపై వైద్యాధికారి ఆరోపణలు
అయితే అనితా రాణిపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆమెపై అనేక ఫిర్యాదులు ఉన్నాయని.. పనిచేసిన ప్రతీచోట రోగులతో గొడవ పెట్టుకునేవారని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి.. వైద్యం చేయకుండా.. రక్తం కారుతున్నా అతన్ని బయటకి పంపించేయడం వాస్తవమేనన్నారు. దీనిపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఆసుపత్రికి వచ్చినవారికి చికిత్స అందించకపోవడం తప్పు కాదా అని ప్రశ్నించారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పని చేసినప్పుడు.. ఎక్కడా ఆర్నెళ్లకు మించి పనిచేయలేదన్నారు.












Click it and Unblock the Notifications