శ్రీకాకుళంలో రామ్మోహన్నాయుడిని ఓడించేందుకు రంగం సిద్ధం చేసిన జగన్?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్లో ఆ పార్టీ వెనకబడింది. అంతటి ప్రభంజనాన్ని కూడా తట్టుకొని శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్నాయుడు వరుసగా రెండోసారి జయకేతనం ఎగరవేశారు. వైసీపీపై మాటల తూటాలు పేలుస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే రామ్మోహన్ నాయుణ్ని ఈసారి ఎన్నికల్లో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ పావులు కదుపుతున్నారు.

1పార్టీ తరుపు ముక్కగా కృపారాణి
అందులో భాగంగానే 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని తరుపు ముక్కగా వాడాలని యోచిస్తున్నారు. జిల్లాలో బలమైన కళింగ సామాజికవర్గానికి చెందిన ఆమెను ఇప్పటి నుంచే జిల్లావ్యాప్తంగా విస్త్రతంగా పర్యటించాలని, ఎంపీగా పోటీచేయడానికి పునాది వేసుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తనను కూడా ఎంపిక చేస్తారని ఆమె భావించినప్పటికీ ఎంపీగా పోటీచేయించాలనే ఆలోచనలో ఉండటంతో కిల్లిని ఎంపిక చేయలేదు.

పార్టీని వీడాలనుకున్నప్పటికీ నచ్చచెప్పిన నాయకులు
తనను రాజ్యసభకు ఎంపిక చేయలేదని, శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన జగన్ను కలిసేందుకు కూడా నాయకులు, పోలీసులు అడ్డంకులు సృష్టించారంటూ కొన్నాళ్ల క్రితం ఆమె అలకబూనారు. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే తాను ఎందుకు రాజ్యసభకు పంపించనది.. భవిష్యత్తులో పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నదీ ఆమెకు ముఖ్యమంత్రి తెలియజెప్పడంతో మెత్తబడ్డారు. 1996 నుంచి 2009 వరకు ఎంపీగా దివంగత ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన తనయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

3టీడీపీకి ఇప్పటికీ బలమైన ఓటుబ్యాంకు
శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ బలమైన ఓటుబ్యాంకు ఉందని భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆ పార్టీని ఓడించేందుకు అందివచ్చే ఎటువంటి అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. చోటా మోటా నేతల నుంచి బడా నేతల వరకు వైసీపీలో చేరడానికి ద్వారాలు తెరిచారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని వైసీపీ గెలుచుకోగులుతుందా? లేదా? అనేది తెలియాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications