రాయలసీమ లిఫ్ట్పై పక్కా వ్యూహంతో జగన్- అపెక్స్ భేటీకి ముందే టెండర్లకు ఏర్పాట్లు...
ఏపీ నీటి ప్రాజెక్టుల విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణతో కయ్యానికి కూడా సై అంటున్న సీఎం జగన్... రాయలసీమ లిఫ్ట్పై ఎలాగైనా తన పంతం నెరవేర్చుకునే దిశగా అడుగులేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందే ఈ ప్రాజెక్టు టెండర్ల ఖరారుకు సిద్ధమవుతున్నారు. తద్వారా ఈ ప్రాజెక్టుకు తమకు ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్ భేటీలో చర్చించాల్సిన అజెండాను కూడా ఇప్పటికే ఖరారు చేసిన జగన్.. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు.

రాయలసీమ లిఫ్ట్ పై జగన్..
కరువు సీమ రాయలసీమకు వరప్రదాయినిగా మారుతుందని భావిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సీఎం జగన్ గతంలో ఎన్నడూ లేనంత పట్టుదలగా కనిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ కరువు కష్టాలు తొలగిపోతాయని అంచనా వేస్తున్న జగన్.. ఇందులో ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకెళ్లాల్సిందేనన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికారులు కూడా అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపెక్స్ కౌన్సిల్ ముందు వినిపించాల్సిన వాదనలను కూడా సిద్ధం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టు టెండర్లను కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

అపెక్స్ భేటీకి ముందే టెండర్లు..
ఓవైపు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు భవితవ్యాన్ని తేల్చేందుకు అపెక్స్ కమిటీ ఈ నెల 20న ఢిల్లీలో సమావేశం నిర్వహించాలని భావిస్తుండగా.. ఆ లోపే తమ పని తాము చేసుకుపోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ఆపొద్దని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో వారు కూడా టెండర్లకు నామినేషన్లను ఆహ్వానించడంతో పాటు ఈ నెల 17న టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ, ఎస్పీఎంఎల్-ఎన్ సీసీ, మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్ధలు బిడ్లు దాఖలు చేశాయి. వీటిని ఆగస్టు 17న పరిశీలించి 19న రాష్ట్రస్దాయి నిపుణుల కమిటీ పరిశీలనకు పంపుతారు. కమిటీ అనుమతి కూడా లభిస్తే తుది బిడ్లు ఖరారవుతాయి.
Recommended Video

జగన్ వ్యూహమిదే...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లేందుకు సిద్ధమైన సీఎం జగన్.. ఆ మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలోపే దీనిపై ఓ క్లారిటీ తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో టెండర్ల ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేయడం ద్వారా తాము ఈ ప్రాజెక్టులపై టెండర్ల ప్రక్రియ కూడా దాటేశామని, ఇప్పుడు ఆపమంటే ఎలా అంటూ ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టుల విషయంలో అపెక్స్ కౌన్సిల్ కానీ, కేంద్రం కానీ ఎలాంటి జోక్యం చేసుకోలేవనే వాదనను కూడా జగన్ రెడీ చేసుకుంటున్నారు. అన్నింటికీ మించి తమకు గతంలో కేటాయించిన జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం వాదించబోతోంది. అయితే దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications