వంశీ పైన అనర్హత వేటు లేనట్లే: జగన్ కొత్త ప్లాన్ ఇదే..: బీజేపీకి దారి చూపించారు..నష్టం ఎవరికంటే..!
ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ టీడీపీగా కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. గతంలో ఎవరైనా ఇతర పార్టీల నుండి తమ పార్టీల్లోకి రావాలంటే ఖచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని స్పష్టం చేసారు. అలా కాకుంటే..అనర్హత వేటు వేయాలని సభా సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో నేరుగా స్పీకర్ ను అభ్యర్దించారు. ఇక, ఇప్పుడు టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో మాత్రం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే..వంశీ పైన అనర్హత వేటుకు అవకాశం లేకుండా చేసారు. ఆయన స్వయంగా స్పీకర్ కు నిండు సభలో తనను స్వతంత్ర అభ్యర్ధిగా గుర్తించాలని కోరటం..స్పీకర్ ఆమోదించటంతో ఇక..వంశీ అనర్హతకు గురయ్యే అవకాశం లేదు. దీంతో..దీని ఇక టీడీపీ నుండి వైసీపీ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలకు దారి చూపించారు. ఇక..ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. ఇంతకీ ఏం జరగబోతోంది...

వంశీపైన అనర్హత వేటు లేనట్లే..
ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను తీసుకున్న నిర్ణయం మార్చుకోకుండానే..కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఆయనను టీడీపీ అధినేత పార్టీ నుండి సస్పెండ్ చేసారు. స్పీకర్ కు మాత్రం సమాచారం ఇచ్చినట్లుగా లేదు. దీంతో..ఆయన టీడీపీ బెంచ్ ల్లోనే కూర్చుకున్నారు. ఈ రోజు సడన్ గా వంశీ తనంతట తానుగా లేచి తాను టీడీపీ సభ్యుడిగా ఉండలేనని..తనను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగించాలని..తనకు మరో చోట సీటు కేటాయించాలని కోరారు. సభలోనే కోరటంతో వెంటనే స్పీకర్ సైతం ఆమోదించారు. ఆ వెంటనే వంశీని స్వతంత్ర అభ్యర్ధిగా పరిగణిస్తూ..నిబంధనలకు అనుగుణంగా ఆయనకు సీటు కేటాయించాలని స్పీకర్ శాసనసభా కార్యదర్శిని ఆదేశించారు. దీంతో..టీడీపీ ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోవటం తో పాటుగా అనర్హత వేటు నుండి వంశీ తప్పించుకున్నారు.

కొత్తగా వచ్చే వారికి దారి చూపుతూ..
కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలని ఉన్నా.. అనర్హత వేటు..రాజీనామా అంశం వారిని వెంటాడుతోందని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న వ్యూహం అలా పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నవారికి దారి చూపుతుందని అసెంబ్లీ లాబీల్లో చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం టీడీపికి 23 మంది సభ్యులు ఉండగా..అందులో వంశీ ఇప్పటికే దూరమయ్యారు. మిగిలిన వారిలో గంటా ఆయనతో పాటుగా మరో ఎమ్మెల్యే పార్టీలో కొనసాగుతారా లేదా అనేది సందేహాంగానే కనిపిస్తోంది. సమావేశాలకు వారిద్దరూ హాజరు కావటం లేదు. అయితే, దీని ద్వారా ఇప్పుడు టీడీపీ నుండి బయటకు రావాలనుకొనే వారికి ఇది కొత్త మార్గంగా కనిపిస్తోంది. అంతిమ లక్ష్యం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారటానికి సిద్దంగా ఉన్నారో..వారిని ఆహ్వానిస్తూనే...వారి పైన ఉప ఎన్నికల ప్రభావం లేకుండా చేయటమే లక్ష్యంగా కనిపిస్తోంది.

బీజేపీ వెసులుబాటు..మరి బాబుకు..
ఇక, ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న కొత్త రూటు..బీజేపీకి వెసులుబాటు కలిగించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ చేరేందుకు గంటా లాంటి వారు సిద్దంగా ఉన్నారనే ప్రచారం ఉంది. టీడీపీ నుండి బీజేపీలోకి చేరాలని భావించే వారు సైతం సభలో ఇదే విధంగా వంశీ రూటునే ఫాలో అయ్యే అవకాశం ఉంది. వారంతటగా వారు సభలో స్పీకర్ కు తమను టీడీపీ సభ్యులుగా కాకుండా..స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గుర్తించమని కోరటం ద్వారా..అటు అనర్హత వేటు..ఉప ఎన్నికలు తప్పించుకోవటమే కాకుండా.. తాము కోరుకున్న పార్టీకి అనధికారికంగా అనుబంధ సభ్యుడిగా ..ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఏర్పడుతుంది. మరి..ఇది ఎంత కాలం అంటే..స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా తుది నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. మరి..ప్రతిపక్ష నేత..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలను ఏ రకంగా
గోడ దూకకుండా కాపాడుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications