ప్రాంతాల సమతుల్యత -సామాజిక న్యాయం : పేదలకు భరోసా -ఇవే లక్ష్యంగా : సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ తన పాలనా లక్ష్యాలను స్పష్టం చేసారు. ప్రాంతాల మధ్య సమతుల్యత.. సామాజిక న్యాయంతో పాటుగా పేదలకు భరోసా కల్పించటమే తన లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ అనేక అంశాలను వివరించారు. పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని సీఎం జగన్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాటి యోధులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
జాతీయ జెండా.. భారతీయుల గుండె
సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి మన జాతీయ జెండా ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. జాతీయ జెండా మన స్వాతంత్రానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని కొనియాడారు. ఆహారం, ఔషధాలు, ఆఖరికి స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్లో కొనసాగుతోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. తమ మూడేళ్ల పాలనలో సాధించిన విజయాలను సీఎం జగన్ వివరించారు. మూడేళ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పారు.
పాలనా సంస్కరణలతో ముందుకు
అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చామని చెప్పారు. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే పింఛన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్తగా ఆర్బీకే కేంద్రాల ఏర్పాటు ద్వారా విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ అన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి రూ. 1.27 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ప్రతీ మండలానికి రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను తీసుకొచ్చామన్నారు.
Recommended Video
ప్రాంతీయ సమతుల్యత అవసరం
అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించామన్నారు. రైతులకు అందిస్తున్న సేవలు...ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు వంటి అంశాల గురించి ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన అంశాన్ని గుర్తు చేసారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వంగా వివరించారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.