కేంద్రానికి సీఎం జగన్ లేఖ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం(ఫిబ్రవరి 6) కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణకు బదులు ప్లాంటును బలోపేతం చేసే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ ద్వారా సుమారు 20వేల మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
Recommended Video
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్దం కాలంపాటు సాగిన ప్రజా పోరాటంతో రాష్ట్రానికి స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందని గుర్తుచేశారు. ఆనాటి ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 2002-2015 మధ్య వైజాగ్ స్టీల్ ఉత్తమ పనితీరు కనబరిచిందని గుర్తుచేశారు. ప్లాంటు పరిధిలో 19700 ఎకరాల విలువైన భూములున్నాయని... ఈ భూముల విలువే దాదాపు రూ.లక్ష కోట్లు ఉంటుందని చెప్పారు. ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్లాంటుకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు.
స్టీల్ ప్లాంటుకు సొంతంగా గనులు లేవన్న విషయాన్ని లేఖ ద్వారా కేంద్రానికి గుర్తుచేసిన సీఎం జగన్... పెట్టుబడుల ఉపసంహరణకు బదులుగా ప్లాంటుకు అండగా నిలబడటం ద్వారా దాన్ని మళ్లీ ప్రగతిబాటలోకి తీసుకెళ్లవచ్చు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏటా 6.3 మిలియన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు. డిసెంబర్ 2020లో ప్లాంటుకు రూ.200 కోట్ల లాభం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే... ప్లాంటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. బైలదిల్లా గనుల నుంచి మార్కెట్ ఖరీదుకు ముడి ఖనిజాన్ని ప్లాంటు కొనుగోలు చేస్తోందని... దాదాపు టన్ను ముడి ఖనిజానికి రూ. 5,260 చొప్పున వెచ్చిస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల వైజాగ్ స్టీల్స్కు టన్నుకు అదనంగా రూ.3,472లు చొప్పున భారం పడుతోందన్నారు. అదే సెయిల్(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) విషయానికొస్తే.. ఆ పరిశ్రమకు సొంతంగా గనులు ఉన్నాయన్నారు. దాదాపు 200 ఏళ్లకు సరిపడా నిల్వలు సెయిల్కు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్స్కు కూడా సొంతంగా గనులు కేటాయించడం ద్వారా పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి తీసెకెళ్లవచ్చునని లేఖలో సూచించారు. అలాగే బ్యాంకులనుంచి తెచ్చుకున్న రుణాల మొత్తాన్ని వాటా రూపంలోకి మార్చగలిగితే నష్టాల నుంచి ఊరట కలుగుతుందన్నారు. వడ్డీరేట్లు కూడా తగ్గిస్తే ప్లాంటుపై భారం మరింత తగ్గుతుందన్నారు. స్టాక్స్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలను కూడా పరిశీలించాలని... తద్వారా ఆర్థిక పునర్నిర్మాణానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు.