నవ్యాంధ్రను నరకానికి కేరాఫ్ గా .. సీఎం జగన్ 'డ్రాకో' ను మించిన పాలన : యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై, మంత్రుల తీరుపై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పై టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని ఇప్పటికే మండిపడుతున్న యనమల తాజాగా జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపి నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అత్యంత క్రూరుడుగా పేరు పొందిన గ్రీస్ రాజు అయిన డ్రాకో తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ చేస్తుంది క్రూరమైన పాలన
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రూరమైన పాలన చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు యనమల రామకృష్ణుడు. డ్రాకోనియన్ పేరుతో రూపొందించిన విశృంఖల అరాచక రాజ్యాంగాన్ని మించిన రాజ్యాంగాన్ని ఏపీలో అమలు చేస్తున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు . జగన్ పాలనలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని యనమల అభిప్రాయపడ్డారు. డ్రాకో యొక్క నేర ప్రవృత్తిని చెబుతూ సిరాతో రాసే చట్టాలను రక్తంతో రాసి ప్రజలను హింసించిన నేరచరిత్ర డ్రాకోది అని పేర్కొన్న యనమల రామకృష్ణుడు నేడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అంతకుమించి అరాచక పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు.

జో బైడెన్ వ్యాఖ్యలను గుర్తు చేసిన యనమల
పౌరుల స్వేచ్ఛను ప్రాథమిక హక్కులను కాలరాస్తూ జగన్ చేస్తున్న పాలన రాక్షస పాలన అని పేర్కొన్నారు. డ్రాకో రాజ్యాంగంలోని అరాచకత్వాన్ని , రాజారెడ్డి అకృత్యాలను కలగలిపి నవ్యాంధ్ర ను నరకానికి కేరాఫ్ అడ్రస్ గా మారుస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రాజకీయ నాయకులకు అధికారం రాదని, ప్రజలు ఇస్తేనే వస్తుందని అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ చెప్పిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని హితవు పలికారు యనమల.

తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్
2014 విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడగకుండా తన కేసుల కోసం తాకట్టు పెట్టారని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు యనమల. రాజ్యాంగ వ్యతిరేక, ప్రజావ్యతిరేక, చట్టవ్యతిరేక నిర్ణయాలతో జగన్ రెడ్డి పాలన ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద ప్రమాదం గా మారిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంతో నమ్మి అధికారాన్ని కట్టబెడితే ప్రజా సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం అధికారాన్ని వినియోగించాలి కానీ రాష్ట్రంలో పరిస్థితి అలా లేదన్నారు .

వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగులుతారు
కక్షసాధింపు చర్యలకు, వికృత చేష్టలకు, విధ్వంసాలకు అధికారాన్ని వినియోగించకూడదు కానీ జగన్ రెడ్డి హయాంలో ప్రజలు ఇచ్చిన అధికారం దుర్వినియోగం అవుతోందని పేర్కొన్నారు. సృష్టించడం తెలిసిన వారికే నాశనం చేసే అర్హత ఉంటుందనేది కనీస జ్ఞానం అని పేర్కొన్న యనమల జగన్ రెడ్డికి ఆదాయం పెంచటం చేతకాదని విమర్శించారు. తమ చర్యలతో వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మారతారని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications