అన్న అన్నే... కొట్లాట కొట్లాటే: అత్తారింటి వైపే షర్మిలా దారి..?
హైదరాబాద్: ఏపీ-తెలంగాణ మధ్య మరోసారి తలెత్తిన జల వివాదాలను అధికార టీఆర్ఎస్ రాజకీయంగా మలచుకుంటోన్న తీరు.. ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో పడేస్తోంది. భారీ నీటి ప్రాజెక్టుల వివాదాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సకాలంలో తెర మీదికి తీసుకుని రావడం వల్ల ఒక దెబ్బతో అనేక పిట్టలు అన్నట్లుగా పరిస్థితి తయారైందనే అభిప్రాయాలు ఉన్నాయి. అటు రాష్ట్ర ప్రయోజనాలపై గళమెత్తినట్టు కావడమే కాకుండా.. అదే సమయంలో ప్రత్యర్థుల నోళ్లను మూయించినట్టవుతుందని అంటున్నారు. ప్రత్యేకించి- జల వివాదాల వ్యవహారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు.. వైఎస్ షర్మిలకు ఇబ్బందులకు గురి చేస్తుందని చెబుతున్నారు.

జులై 8 సమీపిస్తోంది..
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రాజకీయ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి షర్మిల సమాయాత్తమౌతోన్నారు. ఈ గడువు ఎంతో దూరంలో లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏపీతో జల వివాదాలను తెర మీదికి తీసుకొచ్చినట్లు భావిస్తోన్నారు. పార్టీ ప్రకటన చేయడానికి గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో- తన పుట్టినిల్లు రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం కలిగించడానికి తన సొంత అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ అంశాన్ని ప్రస్తావించడం వైఎస్ షర్మిలను ఆత్మరక్షణలో నెట్టినట్టయిందని అభిప్రాయపడుతున్నారు.

షర్మిల సమాధానం చెప్పాల్సిందే..
ఒకవంక- వైఎస్ జగన్ మరోవంక ఆయన సోదరికి రాజకీయంగా ఇబ్బందులను సృష్టించడానికి జల వివాదాలను కేసీఆర్ సర్కార్ కేంద్రబిందువుగా చేసుకున్నట్టే.. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో వైఎస్ షర్మిల తన వైఖరిని స్పష్టం చేయాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది. జల వివాదాలపై ఆమె తన వైఖరిని స్పష్టం చేయక తప్పని పరిస్థితి దాదాపు ఎదురైనట్టే. దీన్ని వ్యతిరేకిస్తే- తన సొంత ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకూలంగా మాట్లాడితే- తెలంగాణలో ప్రతికూల పరిస్థితులు సంభవిస్తాయి. దీనితో ఆచితూచి స్పందించాలని షర్మిల భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

జల వివాదాలపై ఆరా..
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జల వివాదాలు, సమస్యల మూలాల్లోకి వెళ్లి మరీ.. ఈ అంశాలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. జల వివాదాలు ఎలా ఆరంభం అయ్యాయి?, దానిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది?, అన్నింటికీ మించి కేసీఆర్ చెబుతోన్నట్లు తెలంగాణకు నిజంగానే నష్టం కలుగుతుందా? అనే విషయాలపై వైఎస్ షర్మిల అధ్యయనం చేస్తోన్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆమె తెప్పించుకున్నారని అంటున్నారు. దీనిపై ఆచితూచి స్పందించేలా వ్యవహరించాలని భావిస్తున్నారు. నిజంగానే తెలంగాణకు నష్టం కలిగే పరిస్థితి ఎదురైతే- వైఎస్ జగన్తో కొట్లాటకూ వెనుకాడకూడబోరని తెలుస్తోంది.

విధానాన్ని స్పష్టం చేయక తప్పదా?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మొదట్లో పెద్దగా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు దాన్ని ప్రస్తావనకు తీసుకుని వస్తోండటానికి వైఎస్ షర్మిల ఓ కారణమనేది స్పష్టమౌతోంది. జులై 8వ తేదీన తన తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్న వైఎస్ షర్మిలకు చెక్ పెట్టడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యూహాత్మకంగా కేసీఆర్ తెరమీదికి తీసుకొచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో షర్మిల తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందనే డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.












Click it and Unblock the Notifications