జగన్ తేల్చేశారు.. ఆ ఐదు మంత్రులకు పదవీ గండం: సీఎం ప్రతిష్ఠ వారి చేతుల్లోనే..!
ఏపీలో ఏ క్షణమైనా స్ధానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. తొలి నుండి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ..ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలను ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఫిక్స్ చేసారు. ఇక, ఇప్పుడు సొంత పార్టీకి చెందిన మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలకు సైతం హెచ్చరిక చేసారు. ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు గెలవాల్సిందేనని నిర్ధేశించారు. లేకుంటే మంత్రులు నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.
అదే విధంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇప్పుడు ప్రధానంగా ఆ రెండు జిల్లాల నుండి మంత్రులుగా కొనసాగుతున్న ఐదుగురు మంత్రుల పైనే ఫోకస్ అయి ఉంది. అక్కడి నిర్ణయాలు రాజకీయంగా వారికే కాదు..వైసీపీ ప్రభుత్వానికి..ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రతిష్ఠ ఇప్పుడు ఆ ఐదుగురు మంత్రుల చేతుల్లోనే ఉంది. ఇంతకీ ఏం జరుగుతోంది..ఎవరా ఐదుగురు మంత్రులు..వారి ముందున్న ఛాలెంజ్ ఏంటి..

కృష్ణా, గుంటూరు జిల్లా మంత్రుల్లో టెన్షన్..
ఏ జిల్లాలో అయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే మంత్రులు..ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సిందేనని సీఎం జగన్ తేల్చి చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్దంగా లేరనేది అధికారంలో ఉన్న వైసీపీ నేతల అంచనా. ఇదే సమయంలో ప్రధానంగా అమరావతి పరిధిలో ఉన్నకృష్ణా, గుంటూరు జిల్లాల నుండి ఐదుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమరావతి నుండి విశాఖకు పరిపాలనా రాజధాని..కర్నూలుకు హైకోర్టు తరలింపు నిర్ణయాన్ని అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. అమరావతి పరిధిలోని కొన్ని గ్రామాల్లోనే ప్రభుత్వ నిర్ణయం పైన వ్యతిరేకత ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నా..ఆ రెండు జిల్లాల ప్రజలకు తమ ప్రాంతం నుండి రాజధాని తరలింపు పైన అంత సుముఖంగా లేరనేది బహిరంగ రహస్యమే. దీంతో..స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ప్రభుత్వం నుండి రాజధాని తరలింపు పైన ఎటువంటి వ్యాఖ్యలు నిర్ణయాలు ప్రభుత్వం నుండి రావటం లేదు. ఇక, ఈ రెండు జిల్లాల్లోని అనేక మంది ఎక్కువగా అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారు ఉన్నారు. వారంతా రాజధాని తరలింపును సహజంగానే వ్యతిరేకిస్తారు. అదే ఇప్పుడు ఈ రెండు జిల్లాల నుండి మంత్రులుగా ఉన్న ఐదుగురికి సమస్యగా మారుతోంది.

రాజధాని ఎఫెక్ట్ ఏ మేర ఉంటుంది..
అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని..అదే విధంగా ఒక్క వర్గానికి చెందిన వారికే లాభం జరిగిందని వైసీపీ నేతలు కొంత కాలంగా ప్రచారంలోకి తెచ్చారు. అయితే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు బలంగా పని చేస్తాయి. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు విమర్శించిన వర్గానికి చెందిన ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ఫలితాలను తారు మారు చేసే స్థాయిలోనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆ వర్గం సైతం అనూహ్యంగా అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి మద్దతుగా నిలిచింది. ఫలితంగా టీడీపీకి ఈ రెండు జిల్లాల్లో కేవలం నాలుగు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. అయితే, అమరావతి ఎపెక్ట్ రెండు జిల్లాల్లో పూర్తిగా లేకపోయినా..కొంత మేర ప్రభావం ఉంటుందని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రధానంగా మంత్రులు మోపిదేవి..కొడాలి నాని..పేర్ని నాని..సుచరిత.. వెల్లంపల్లి ఈ రెండు జిల్లాల నుండి పార్టీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతలను మోయాల్సి వస్తోంది. ఇక, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వన్ సైడ్ ఫలితాలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువని అంతర్గత చర్చల్లో వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు.
Recommended Video


గెలిస్తేనే పదవులు..లేకుంటే మాజీలుగానే..
దీంతో..ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోని ఐదుగురు మంత్రులకు సవాల్ గా మారింది. అదే విధంగా..అమరావతి నుండి రాజధాని తరలింపు పైన ప్రజలు సానుకూలంగా ఉన్నారని.. జగన్ అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తున్నారని చెబుతున్న సమయంలో ఇక్కడి ఫలితాలు ఈ ఐదుగురు మంత్రులకే కాదు..ముఖ్యమంత్రి ప్రతిష్ఠతోనూ ముడి పడి ఉన్నాయి. ప్రధానంగా ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తే రాజధాని తరలింపు నిర్ణయాన్ని రాజకీయంగా అనుకూలంగా మలచుకుంటున్న పార్టీలకు సైతం సమాధానం చెప్పినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో..మొత్తం 13 జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నా...అమరావతి పరిధిలో వచ్చే ఫలితాలు..మంత్రుల రాజకీయ భవిష్యత్ పైనే ఇప్పుడు ఆసక్తి కర చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications