సీఎం జగన్ సంచలనం: కీలక బాధ్యతల నుంచి సజ్జల - కొడాలికి ఉద్వాసన..!!
ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ పార్టీ నిర్వహణలో మార్పులు చేర్పులు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీలో కీలక మైన ప్రాంతీయ సమన్వయకర్తల మార్పు విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలను మార్చేసారు. కొద్ది రోజుల క్రితం జరిగిన పార్టీ వర్క్ షాపులో పార్టీ సమన్వయ కర్తలు సమర్ధంగా వ్యవహరించలేకపోతే తప్పుకోవాలని..లేకుంటే తానే తప్పిస్తానని స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు కీలక నేతలతో పలువురిని ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
సజ్జల..బుగ్గన..కొడాలి..అనిల్ ను తప్పిస్తూ
కొద్ది నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ తరువాత సీనియర్లను ఏరి కోరి సీఎం జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. ఇప్పుడు వారిలో పలువురిని మారుస్తూ నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఆర్దిక మంత్రి బుగ్గన, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లను కూడా ఈ బాధ్యతల నుంచి తప్పించారు.
ఇప్పటి వరకు సజ్జల..ఆర్దిక మంత్రి బుగ్గన కు అప్పగించిన కర్నూలు-నంద్యాల జిల్లాల బాధ్యతలను కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాధ్ రెడ్డికి కేటాయించారు. మాజీ మంత్రి అనిల్ వద్ద ఉన్న కడప-తిరుపతి జిల్లాల బాధ్యతలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేనికి కేటాయించారు. బాపట్ల జిల్లా సమన్వయకర్త బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావుకు ఇచ్చారు.
అమరావతి జిల్లాలకు కమ్మ- రెడ్డి కాంబినేషన్
ఇప్పటి వరకు మాజీ మంత్రి కొడాలి నానికి అప్పగించిన పల్నాడు జిల్లా బాధ్యతలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కేటాయించారు. కొడాలి నాని నుంచి తప్పించిన గుంటూరు జిల్లా బాధ్యతలను ఇప్పటికే క్రిష్ణా-ఎన్టీఆర్ జిల్లాల సమన్వయ కర్తగా ఉన్న మర్రి రాజశేఖర్ కు అప్పగించారు. అమరావతి పరిధిలోని కీలకమైన ఈ మూడు జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను మర్రి రాజశేఖర్ తో పాటుగా రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పర్యవేక్షించనున్నారు.
సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి బాధ్యతల్లో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. విజయనగరం జిల్లా బాధ్యతలను మంత్రి బొత్సా నుంచి తప్పించారు. మంత్రి సొంత జిల్లా బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కేటాయించారు. ఇప్పటి వరకు వైవీ సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సాకు అప్పగించారు.
పార్టీలో ఎన్నికల టీం రెడీ చేస్తున్న సీఎం జగన్
ఇక, తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించారు. ఆయనకు కీలకమైన పార్టీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటికే వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఇక చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 4న సీఎం జగన్ గడప గడపకు ప్రభుత్వం పైన మరో సారి వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ లోగానే ప్రాంతీయ సమన్వయకర్తల మార్పు పైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొందరి పని తీరు కారణంగా మార్చితే..మరి కొందరు అనారోగ్య సమస్యలు - వ్యక్తిగత అంశాల కారణంగా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, పార్టీలో కీలక నేతలుగా గుర్తింపు ఉన్న వారైనా..పార్టీ కోసం ఎలాంటి నిర్ణయాలకు వెనుకాడననే సంకేతాలను సీఎం ఇచ్చారు.