ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలి : బకాయిలపై దృష్టిపెట్టాలి : సీఎం జగన్ సీరియస్..!!
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాజాగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో వెలుగులోకి వచ్చిన నికలీ చలాన్ల వ్యవహారం పైన సీఎం సీరియస్ అయ్యారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు..వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను సీఎం ప్రశ్నించారు. తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్చేశామని అధికారులు వివరించారు.
ఎప్పటి నుంచి జరుగుతోంది..ఇలా..
ఈస్థాయిలో తప్పులు జరుగుతుంటే.. ఎందుకు మన దృష్టికి రావడంలేదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎప్పటినుంచి.. ఎన్నిరోజులనుంచి ఈ తప్పులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా?లేవా?ఎందుకు చూడ్డంలేదంటూ ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకోండని సూచించారు. అవినీతిపై ఎవరికి కాల్చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్నంబర్ ఉంచండని సీఎం ఆదేవించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నంబర్ఉండాలి.. కాల్సెంటర్కు వచ్చే కాల్స్మీద అధికారులు దృష్టిపెట్టండని స్పష్టం చేసారు.
అన్ని చలాన్ల చెల్లింపుపైనా విచారణ చేయండి
కాల్సెంటర్మీద అధికారులు ఓనర్షిప్ తీసుకోండి..అవినీతిని నిర్మూలించడానికి సరైన ఎస్ఓపీలను తీసుకురావాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. కేవలం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే కాదు, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. సాఫ్ట్వేర్మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామన్న ఆర్థికశాఖ అధికారులు..అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని చెప్పుకొచ్చారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా కూడా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో..రాష్టానికి ఆదాయవనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
ఆదాయ వనరులు పెరిగేలా చూడాలి..
ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం..ప్రతిఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్నారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలని నిర్దేశించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలని సీఎం స్పష్టం చేసారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలన్న సీఎం, దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశించారు.
సమన్వయంతో పని చేయండి..
ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని.. మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. సరైన కార్యాచరణ ద్వారా ప్రజలకు చక్కగా సేవలు అందుతాయి, ఆదాయాలు కూడా పెరుగుతాయని సీఎం చెప్పుకొచ్చారు. కనీసంగా వారం - పదిరోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. ఆదాయవనరులు, పరిస్థితులపై సమీక్షచేయాలని స్పష్టం చేసారు. వివిధ రంగాల వారీగా సమీక్ష చేయాలన్నారు. ప్రతి సమావేశంలో ఒక రంగంపై సమీక్షచేయాలని నిర్దేశించారు.
అక్రమ మద్యం పైన ఉక్కుపాదం మోపాలి..
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును తదుపరివారంలో పరిశీలన చేయాలని సూచించారు. అదే విధంగా.. మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలని నిర్దేశించారు. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నామని..దీనివల్ల సరిహద్దులనుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నామని చెప్పారు. ఇలాంటి వ్యవహారాలపై కచ్చితంగా ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు.