సీఎం జగన్ సీరియస్-అమరావతికి రండి : ఎంపీ భరత్..ఎమ్మెల్యే రాజాకు పిలుపు : ఆ రిపోర్టు ఆధారంగా.!!
పార్టీ ఎంపీ భరత్..ఎమ్మెల్యే రాజా ఇద్దరూ హద్దు మీర చేసుకుంటున్న ఆరోపణల పైన సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిష్ఠ దిగజార్చే విధంగా ఇద్దరూ వ్యవహరిస్తున్నారని..వారిని అమరావతికి పిలించాల ని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వారిద్దరి విషయం పైన సీఎం ఉభయ గోదావరి జిల్లాల పార్టీ సమన్వయకర్తగా ఉన్న ..టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి వద్ద సీఎం ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో.. మంగళవారం ఇద్దరు నేతలు అమరావతికి రావాలని సందేశం పంపారు.
గతంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు మొదలైన సమయంలో సుబ్బారెడ్డి మాట్లాడి సయోధ్య కుదిర్చారు. తిరిగి కొంత కాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తి పైన దాడి విషయంలో చోటు చేసుకున్న వివాదంలో ఇద్దరి మధ్య తిరిగి ఆధిపత్య పోరు మొదలైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరింది. జక్కంపూడి రాజా, ఎంపీ భరత్పై తీవ్ర ఆరోపణలు చేయడంతోపాటు పిచ్చి ఎంపీగా, సినిమాట్రిక్స్ బొమ్మ చూపిస్తున్నారంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నీ వెనుక రౌడీలు, భూమాఫియా ఉందని, హత్యలు చేసి ఆత్మహత్యలుగా మార్చే ఘనులు ఉన్నారని ఎంపీపై ఎమ్మెల్యే ఆరోపణ చేశారు.
గతంలో అంతర్గతంగా కొనసాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఓపెన్ గా ఒకరిపై మరొకరు సవాళ్లు చేసుకుంటున్నారు. మార్గాని భరత్ తొలి సారి ఎంపీ అయినా..లోక్ సభలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ విప్ గా అవకాశం ఇచ్చారు. అదే విధంగా జక్కంపూడి రాజాకు కొద్ది రోజుల క్రితం వరకూ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో 4 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అందులో రాజమండ్రి అర్బన్..రూరల్ నియోజకవరర్గాలు ఉన్నాయి. అక్కడ ఆధిపత్యం కోసం భరత్..రాజా ఇద్దరూ పోటీ పడుతున్నారు.
ఆ రెండు నియోజకవర్గాల్లోని వైసీపీ ఇన్ ఛార్జ్ లను మార్చాలనే అంశం పైన ఇద్దరి మధ్య వివాదం సాగుతోంది. అయితే, ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించటం సీఎం దాకా వెళ్లాయి. దీంతో...ఇద్దరితోనూ మాట్లాడాలని , తన వద్దకు పంపాలని సీఎం పార్టీ సీనియర్ నేత సుబ్బారెడ్డికి సూచించారు. ఎమ్మెల్యే రాజా వెనుక ఉన్నదంతా రౌడీలే అంటూ భరత్ వ్యాఖ్యానించారు. అదే విధంగా ఎంపీ భరత్ రాజమండ్రిలో పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజా మండిపడ్డారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీ దిగారని..జగన్ ను ఇబ్బంది పెట్టిన జేడీ తో భరత్ కు ఏం పని అంటూ నిలదీసారు. అయితే, భరత్ తాను జేడీని ఒక ఫంక్షన్ లో ఎదురు పడ్డామని చెబుతూ..తాను ఫొటోలు దిగినట్లు ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేసారు. ఇక, ఇద్దరి మద్య సవాళ్లు ముదురుతుండటం..జిల్లాలో ఇద్దరి వ్యవహార శైలికి పార్టీకి ఇబ్బందిగా మారుతుండటంతో పార్టీ అధినాయకత్వం దీని పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వీరిద్దరి వివాదాలు..వాస్తవాల పైన నిఘా వర్గాల నుంచి నివేదిక స్వీకరించినట్లు చెబుతున్నారు.
దీంతో..మంగళవారం ఇద్దరితోనూ సుబ్బారెడ్డి ముందుగా మాట్లాడనున్నారు. వారిచ్చే సమాధానం ఆధారంగా వారితో కలిసి సీఎం వద్దకు వెళ్లనున్నారు. సీఎం ఇప్పటికే ఇద్దరు నేతల పైన ఆగ్రహంతో ఉండటంతో ఈ నేతలిద్దరి పైన ఏ స్థాయిలో రియాక్ట్ అవుతారు.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.