మంత్రులకు సీఎం జగన్ క్లాస్-కలిసి వెళ్లాల్సిందే : మైనార్టీ సబ్ ప్లాన్-గృహ రుణాలపై వన్టైమ్ సెటిల్మెంట్ ..!!
ఏపీ మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో దాదాపు 39 అంశాల అధికారిక అజెండా పైన సుదీర్ఘంగా చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. అఫీషియ ల్ అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో సీఎం జగన్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు. క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మైనార్టీ సబ్ ప్లాన్ కు ఆమోదం
విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. మైనార్టీలకు సబ్ప్లాన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించాలని కెబినెట్ అధికారుల ను ఆదేశించింది. ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యజమాన్యానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా..మైనార్టీ సబ్ ప్లానుకు ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది.
వ్యవసాయ వినియోగానికి 10 వేల మెగా వాట్లు
రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు కెబినెట్ ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగా వాట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో యూనిట్టుకు రూ. 2.49కు సరఫరా చేసేలా కెబినెట్ డెసిషన్ తీసుకుంది. ఆర్ అండ్ బికి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్డీసీకి బదలాయించడానికి కెబినెట్ ఆమోదం తెలిపింది.
గృహ రుణాలపై వన్టైమ్ సెటిల్మెంట్
పేదల గృహ రుణాలపై వన్టైమ్ సెటిల్మెంట్కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలపై లోన్లు తెచ్చుకునే ప్రక్రియ కొనసాగుతోంది.ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇచ్చేందుకు తీర్మానం చేసినట్లు మంత్రి నాని వెల్లడించారు. వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా 46,61,737 మంది లబ్ధి పొందనున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేల వన్టైమ్ సెటిల్మెంట్ సౌకర్యం పొందవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, నగరపాలక సంస్థల పరిధిలోని వారయితే రూ.20 వేలు చెల్లించి వన్టైమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చని తెలిపారు.
ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టరా..
ఇక, అధికారికంగా చర్చలు ముగిసిన తరువాత మంత్రులతో సీఎం తో రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టటంతో ఇక నుంచి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం నిబద్దతతో పధకాలు అమలు చేస్తున్నా.. పెన్షన్లలలో కోత అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రులు ఎందుకు తిప్పి కొట్టలేక పోతున్నారంటూ సీఎం జగన్ మంత్రుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
స్పందించాల్సిన బాధ్యత మీపైనే ఉంది
ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తుంటే..మంత్రులుగా స్పందించరా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పధకాల అమలు విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాని మంత్రులకు సీఎం నిర్దేశించారు. అదే విధంగా.. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలని సీఎం ఆదేశించారు. ధనికులను కూడా పెన్షన్ లబ్దిదారుల జాబితాలో చేర్చిన గత టీడీపీ ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసిందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.
మంత్రులకు జగన్ దిశా నిర్దేశం..
ఇదే విషయాన్ని లెక్కలు..ఆధారాలతో సహా ప్రజల ముందుకు ఉంచాలంటూ సీఎం తన కేబినెట్ సహచరులకు సూచించారు. విద్యుత్ ఛార్జీల అంశం పైన వీరి మధ్యకు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రూ అప్ ఛార్జీల విషయం పైన అధికారులు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందీ వివరించారు. విద్యుత్ భారం కూడా గత ప్రభుత్వానిదేనని పలువురు మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న లబ్దిని.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా స్థానికంగా ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలను కలుపుకొని మంత్రులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక, ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారు.