ప్రజల్లోకి సీఎం జగన్ - ముహూర్తం ఫిక్స్ : ఎన్నికల పైనా క్లారిటీ - ఇక కార్యకర్తలతోనూ...!!
తిరిగి అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం ముహూర్తం సైతం దాదాపుగా ఫిక్స్ అయింది. జగన్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ప్రతీ వారం ఒక్కో ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్లి..వారితో మమేకం అయ్యేలా ఒక ప్రణాళిక సిద్దం చేసారు. కానీ, వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా అది అమలు కాలేదు. ఇక, మూడేళ్ల పాలన ముగుస్తూనే ఏపీలో ఎన్నికలకు ముందస్తుగా కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం అన్ని పార్టీలు సిద్దం అవుతున్నాయి.

పార్టీ - ప్రభుత్వంపై సీఎం ఫోకస్
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. అక్టోబర్ 2 నుంచి లోకేష్.. అక్టోబర్ 5 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. లోకేష్ గతంలో తన తండ్రి నిర్వహించిన "మీ కోసం" పేరుతోనే ఇప్పుడూ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపుగా ఆరు నెలల పాటు అన్ని జిల్లాలోనూ బస్సు యాత్రలు చేయనున్నారు. ఇక, ఇదే సమయంలో సీఎం జగన్ సైతం ప్రజల్లోకి వెళ్లి తన పాలన పైన స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకోవటంతో పాటుగా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్దం అవుతున్నారు. 2017 లో నవంబర్ 6న జగన్ తన సుదీర్ఘ పాదయాత్రను ఇడపులపాయ నుంచి ప్రారంభించారు.

స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి
ఇప్పుడు 2024లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ తిరిగి అదే రోజన తన రచ్చబండకు ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ప్రతీ రోజు రెండు లేదా మూడు నియోజకవర్గాలకు చెందిన లబ్ది దారులతో సమావేశం.. అదే నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలతో పార్టీ పరంగా సమావేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జిల్లాలు - నియోజకవర్గాల సమీక్షలకు వెళ్లిన సమయంలో ఆర్దికంగా అక్కడ వచ్చే అభ్యర్ధలను వెంటనే నిధులు మంజారు చేయాల్సి ఉంటుంది. దీంతో..ఆర్దికంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల కారణంగా కొంత ఆలస్య అయినట్లుగా చెబుతున్నారు. కానీ, కరోనా తో పాటుగా ఆర్డికంగా కష్టాలు ఉన్నా.. తాను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేయనున్నారు.

ముందస్తు ఎన్నికల పై అప్పుడే నిర్ణయం
అదే విధంగా పని చేయని పార్టీ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వటం పైన ఇప్పటికే జగన్ తేల్చి చెప్పారు. దీంతో..జిల్లా స్థాయి సమీక్షలు సైతం ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వారంలో మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటనలు - సమీక్షలు జరిగే విధంగా ప్రణాళిక సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లోగా ఈ పర్యటనలు పూర్తి చేసి ఎన్నికలకు స్పష్టమైన కార్యచరణ ప్రకటన దిశగా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు. ఇక, ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం జగన్ క్షేత్ర స్థాయి పర్యటనల తరువాతనే దీని పైన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, ముఖ్య నేతలంతా క్షేత్ర స్థాయి పర్యటనల్లో ఉండనుండటంతో ఏపీలో రాజకీయంగా వాతావరణం మరింత హీటెక్కే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications