ఎన్నికల వేళ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!!
ముఖ్యంత్రి జగన్ ఎన్నికలకు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మరో అడుగు వేస్తున్నారు. ఈ నెల 22న బందరు పోర్టు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పోర్టు నిర్మాణానికి కేంద్రం నుంచి ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి. అయిదు వేట కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారం రాజకీయ చర్చకు కారణమవుతోంది.
బందరుకు సీఎం జగన్: ఈ నెల 22న బందరు లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పలు పనులను సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. న్యాయస్థానంలో కేసుల వల్ల ఆలస్యమైనా వాటి పరిష్కారంతో పోర్టు పనులు ప్రారంభం అవుతున్నాయని వివరించారు. తొలి దశలో 5 వేల కోట్లతో పోర్టు పనులు ప్రారంభం అవుతాయన్నారు. పోర్టు పనుల ద్వారా జిల్లా వాసుల కల నెరవెరుతోందని వివరించారు. గత ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం ఎన్నికల ముందు శంకుస్థాపన చేసిందని పేర్ని నాని విమర్శించారు. టీడీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టారు. పోర్టు నిర్మాణం కోసం రుణం కూడా మంజూరైందని చెప్పారు. 24 నెలల్లో తొలి దశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించిందని పేర్ని నాని వివరించారు.

పోర్టుకు శంకుస్థాపన: పోర్టు శంకుస్థాపన సమయంలో టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని పైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేసారు. బందరు అభివృద్ధిపై సీఎం జగన్ సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేసారు. పేర్ని నాని చరిత్ర బందరులో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల గుడౌన్లు ఎలా వచ్చాయో పేర్ని చెప్పాలని డిమాండ్ చేసారు. 2 లక్షల టన్నుల మట్టి ఏ అనుమతి ఉందని తరలించారో చెప్పాలన్నారు. బందరు పోర్టు నిర్మాణం నాడు టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఈపీసీ విధానం ద్వారా కమీషన్ల కోసం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కమీషన్ల ప్రభుత్వంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు: టీడీపీ, జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రాంతాల వారీగా సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న మెజార్టీ ప్రాజెక్టును క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి బందరుపోర్టు పనులను ప్రారంభించటం ద్వారా తొలివిడతగా నాలుగు బెర్తులు నిర్మాణం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పోర్టు నిర్మాణంతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిఅవకాశాలు వస్తాయని వివరిస్తున్నారు.ఇప్పుడు మచిలీపట్నంలో టీడీపీ- జనసేన కలిసి పోటీ చేస్తున్న వేళ సీఎం జగన్ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది.












Click it and Unblock the Notifications