సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో సీఎం జగన్ సమావేశం..!!
ఏపీ పర్యటనలో ఉన్న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. సీజేఐ చంద్రచూడ్ తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. రేపు (30వ తేదీ)న మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన విజయవాడ చేరుకున్నారు. నోవాటెల్ హోటల్ ో బస చేసిన సీజేఐతో ఈ సాయంత్రం సీఎం జగన్ మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు.
గతంలో చంద్రబాబు హయంలో అమరావతి తాత్కాలిక భవనం ప్రారంభానికి అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గగోయ్ వచ్చారు. ఆ తరువాత కొద్ది నెలల క్రితం అమరావతిలోని హైకోర్టులో జరిగిన కార్యక్రమానికి అప్పటి సీజేఐ ఎన్వీ రమణ హాజరయ్యారు. ఇప్పుడు అమరావతికి వస్తున్న మూడో సీజేఐ చంద్రచూడ్. ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు. ఈ భేటీలో హైకోర్టు బదిలీకి సంబంధించి ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్లమెంట్ లో కేంద్ర తమ వైఖరిని స్పష్టం చేసింది. కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసారు.

మూడు రాజధానుల నిర్ణయం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. అదే విధంగా ఏపీలో హైకోర్టు శాశ్వత భవనం..కింది స్థాయి కోర్టుల్లో సదుపాయాలు, ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని గతంలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన సమయంలోనే సీఎం హామీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి హైకోర్టు నుంచి వచ్చిన ప్రతిపాదనలు..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించే ఛాన్స్ ఉంది. ఇక, మంగళగిరిలో జ్యూడిషియల్ అకాడమీ పనులను ఇప్పటికే ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు పరిశీలించారు. తాజాగా, అక్కడ భోదన కోసం న్యాయాధికారులను నియమించారు. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జ్యూడీషియల్ ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తరువాత మధ్నాహ్నం 12.15 గంటలకు సీజేఐ చంద్రచూడ్ తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.












Click it and Unblock the Notifications