సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం - గ్రౌండ్ రిపోర్ట్స్ రెడీ : ఆ 11 మంది ఎమ్మెల్యేపై...!!
ముఖ్యమంత్రి జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేడు మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఇప్పటి నుంచే తన టీం ను రెడీ చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో ముందుగా అభ్యర్ధుల ఎంపిక సమయంలోనే ప్రతిపక్షాల పైన జగన్ మానసికంగా దెబ్బ కొట్టారు. అనూహ్య సమీకరణాలను అమలు చేసారు. ఇప్పుడు..అంతకంటే ఎక్కువగా వచ్చే ఎన్నికలను వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా..సిటింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల ఖరారు పైన క్లారిటీ ఇచ్చేస్తున్నారు. సీటు దక్కాలంటే ఏం చేయాలి..ఎలా ఉండాలనేది క్లియర్ గా చెబుతున్నారు. దీని కోసం ప్రారంభించిన గడప గడపకు ప్రభుత్వం కొలమానంగా తీసుకుంటున్నారు.
ప్రతీ ఎమ్మెల్యేపై పూర్తి సమాచారం
ఇదే సమయంలో ఎమ్మెల్యేల పని తీరు..ప్రజలతో మమేకం..వ్యవహార శైలి..పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత వంటి అంశాల ఆధారంగా అనేక మార్గాల్లో సమాచారం సేకరించారు. తన వద్దకు చేరిన ఈ సమాచారం ఆధారంగా పార్టీ ఎమ్మెల్యేలు..జిల్లా అధ్యక్షులు..సమన్వయకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇప్పటికే మూడు విడతలుగా ఇటువంటి సమావేశాలను సీఎం జగన్ ఏర్పాటు చేసారు. ప్రధానంగా ఎమ్మెల్యేల పని తీరు పైనే ప్రస్తావించారు. ఇదే సమయంలో పలు రకాలుగా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేల భాగస్వామ్యం.. కార్యక్రమ తీరు.. ప్రభుత్వ ఉద్దేశం ఎంత మేర నెరవేరుతోంది.. ప్రజల నుంచి ఎమ్మెల్యేకు ఎటువంటి స్పందన వస్తోంది..నియోజకవర్గాల్లో టీడీపీ ఎంత మేర బలం పెంచుకుందీ.. నియోకవర్గంలో చేయాల్సిన మార్పుల పైన సమాచారం సిద్దం చేసుకున్నారు. దీంతో.. కొన్ని ఎంపిక చేసిన నియోజకవర్గాలకు కొత్తగా పరిశీలకులను నియమించాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులు
నియోజకవర్గంలో ఎమ్మెల్యే..పార్టీ ఇంఛార్జ్ .. సమన్వయకర్తల పనితీరు.. ప్రత్యర్ధి పార్టీల వ్యూహాలు.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన ఆ పరిశీలకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి సమన్వయకర్తకు సమాచారం అందిస్తారు. క్షేత్ర స్థాయి నుంచి అనేక మార్గాల్లో సేకరిస్తున్న సమాచారంతో పాటుగా వీరి నుంచి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన మార్పుల దిశగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకొనే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే, అదనపు సమన్వయకర్త పేరుతో జరిగిన నియామకాలతో కొత్తగా సమస్యలు వస్తుండటంతో..పరిశీలకుల పేరుతో నియామకాలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక, గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజు తొలి స్థానంలో ఉండగా.. ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఆ తరువాత స్థానంలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
11 మంది పని తీరుపై సీరియస్
అదే సమయంలో 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అయిదు రోజులు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన లేదని సమాచారం అందినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. వారి పైన సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఆ 11 నియోకవర్గాల్లోని ఎమ్మెల్యేలు..పార్టీ ఇంఛార్జ్ లకు ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠకు కారణమవుతోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన ఆరోపణల తీవ్రత పెంచటం.. సీట్ల ఖరారు చేస్తున్నట్లుగా ప్రకటనలు ఇవ్వటం ద్వారా.. మైండ్ గేమ్ పెంచినట్లుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లుగా ప్రభుత్వం పైన విమర్శలకు సమాధానం ఇచ్చేలా పార్టీ నేతలకు సీఎం దిశా నిర్దేశం చేయటంతో పాటుగా.. సీట్ల కేటాయింపు పైన తన వైఖరి ఈ సమావేశంలో తేల్చి చెప్పే అవకాశం కనిపిస్తోంది.