ఇక..ప్రజల్లోనే సీఎం జగన్ -ముహూర్తం ఫిక్స్ : ప్రతిపక్షాలకు అక్కడి నుంచే- పార్టీ నేతలకూ టైం..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల మూడు నెలల కాలం పూర్తి కావస్తోంది. ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యే ఎక్కువ కాలం గడిపిన జగన్..సీఎం అయిన తరువాత అధికార సభల్లో మినహా..ప్రజల్లోకి వెళ్లలేదు. కరోనా కారణంగా పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కొన్ని కార్యక్రమాలను వర్చ్యువల్ విధానంలో పూర్తి చేసారు. ఇక, ఇప్పటి నుంచి మరో రెండున్నార కాలమే ఎన్నికలకు సమయం ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు పద్దతి ప్రకారం తన ప్రభుత్వాన్ని డామేజ్ చేస్తున్నాయని జగన్ గ్రహించారు.
ప్రజలతోనే ఇక ఎక్కువ సమయం..
ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. తన పాలనలోని లోపాలను సైతం స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు. సీఎం అయిన తరువాత పార్టీ పైన జగన్ ఫోకస్ పెట్టటం లేదనే వాదన పార్టీలో ఉంది. దీనికి కూడా సమాధానంగా కొత్త కార్యక్రమాని కి జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా..సీఎం జగన్ ప్రజలతో మమేకం అయ్యేందుకు రచ్చబండ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, అది అనేక కారణాలతో సాధ్యపడలేదు. తన తండ్రి చివరి కార్యక్రమంగా..దేని కోసమైతే ప్రజల వద్దకు వెళ్తూ..ప్రాణాలు కోల్పోయారో..అదే కార్యక్రమాన్ని తాను కొనసాగించాలని నిర్ణయించారు.
అక్టోబర్ 2 నుంచి రచ్చబండ..
అక్టోబర్ రెండున గాంధీ జయంతి నుంచి ఈ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయిలో సచివాలయాలను సందర్శించి అక్కడే స్థానిక ప్రజలతో మమేకం అవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ పధకాల అమలు-నిర్వహణలో లోపాలు- అధికారుల పని తీరు - సచివాలయం నుంచి అందుతున్న సేవల గురించి నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరిస్తారు. అవసరమైన మార్పులు- చేర్పులు పైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇందు కోసం ఈ కార్యక్రమానికి సైతం రచ్చబండ పేరునే ఖరారు చేసారు.
వారంలో రెండు రోజులు జిల్లాల్లోనే..
వారంలో కనీసం రెండో ప్రాంతాల్లో ఈ రచ్చబండ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా... ఉదయం సమాచారం ఇచ్చి మధ్నాహ్నం లోగా అక్కడకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. అదే విధంగా.. దసరా నుంచి విశాఖలో తన క్యాంపు కార్యాలయం ద్వారా విధులు నిర్వహించాలని సీఎం దాదాపుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా..పార్టీ ప్రధాన కార్యాలయం సైతం విశాఖకు తరలిస్తున్నారు.
పార్టీ నేతలకు...జిల్లాల వారీగా సమీక్షలు..
దసరా నుంచి వారంలో రెండు రోజులు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. వారంలో రెండు సార్లు.. రెండు జిల్లాల నేతలతో సీఎం సమావేశం అవుతారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సీఎం అప్పాయింట్ మెంట్లు ఇవ్వటం లేదనే వాదన ఉంది. పార్టీ ఇన్ ఛార్జ్ ల తోనే ఎమ్మెల్యేలు తమ సమస్యలు చెప్పుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో ఆర్దిక సమస్యల కారణంగా ఎమ్మెల్యేల వినతుల పైన వేగంగా నిర్ణయాలు జరగటం లేదు. దీంతో..కొందరు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తం అవుతోంది.
వచ్చే ఎన్నికల వరకూ ప్రజల మధ్యనే..
ముందుగా జిల్లా పరిషత్ కార్యవర్గాలు సైతం పూర్తి అయితే, ఇక సార్వత్రిక ఎన్నికల వరకూ ఆ ఊసే ఉండదని..పూర్తిగా తనతో పాటుగా పార్టీ నేతలను ప్రజలతోనే ఉండేలా చూడాలని సీఎం భావిస్తున్నారు. ఇక, ప్రతిపక్షాలు ప్రభుత్వ పధకాల మీద-తన ప్రభుత్వ మీద చేస్తున్న విమర్శలకు సైతం ప్రజలకు వివరిస్తూ..అక్కడి నుంచే సమాధానం ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు. సెప్టెంబర్ 2 న వైఎస్సార్ వర్దంతి నాడు ఈ కార్యక్రమం ప్రారంభించాలని భావించారు. ఆ రోజునే వైఎస్సార్ రచ్చబండ నిర్వహణ కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు.
Recommended Video
ప్రతిపక్షాలకు ప్రజల మధ్య నుంచే సమాధానం..
సెప్టెంబర్ 15 నుంచి సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటుగా.. కరోనా పూర్తిగా తగ్గకపోవటం...పాలనా పరమైన వ్యవహారాలు ఉండటంతో అక్టోబర్ రెండు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు - అధికారులు సచివాలయాల బాట పట్టారు. ఇక, సీఎం జగన్ ప్రజల బాట పట్టనుండటంతో ఏపీలో మరోసారి రాజకీయ సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.