చంద్రబాబుకు సీఎం జగన్ గిఫ్ట్ : అటు విజయవాడ - ఇటు కుప్పం : ఇక, బాలయ్య ఇలాకాలో..!!
ఏపీలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే కొత్త నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మొదలు పెట్టి.. కేబినెట్ ప్రక్షాళనతో కొనసాగిస్తూ.. ప్రజల్లోకి వెళ్లాలనేది సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగా కొత్త జిల్లాల ప్రకటన విషయంలోనూ టీడీపీని ఆత్మరక్షణలో పడేసే నిర్ణయాల వైపు జగన్ మొగ్గు చూపుతున్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేసారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించటంతో దీని పైన జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ కు అనుగుణంగా పలు సూచనలు..సలహాలు వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదంటూ వైసీపీ నేతలే విమర్శలు చేస్తూ వచ్చారు.
సీఎం జగన్ రాజకీయ వ్యూహం
ఇక, ఇప్పుడు తుది నోటిఫికేషన్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ పార్లమెంటరీ పరిధిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో..చంద్రబాబు సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పైన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలు - రెవిన్యూ డివిజన్ల పెంపు సమయంలో ప్రజలతో పాటుగా పార్టీలు.. సంస్థల నుంచి ప్రభుత్వ అధికారులు సూచనలు . సలహాలు..అభ్యంతరాలు స్వీకరించారు. అందులో..కుప్పం ను రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయి. అందులో కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయాలంటూ ప్రభుత్వానికి వినతులు అందాయి. అలా ఇచ్చిన వారిలో కుప్పం టీడీపీ నేతలు సైతం ఉన్నట్లుగా వైసీపీ ముఖ్యులు చెబుతున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
రెవిన్యూ డివిజన్ గా కుప్పం
చంద్రబాబు బామ్మర్ది బాలయ్య..హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా చేయాలని కోరగా.. కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయాలంటూ మన ప్రభుత్వానికి వినతులు వచ్చాయని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి చేయలేనిది..తాము చేస్తున్నామని..విజన్ ఎవరిదని ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తాజాగా కొత్తగా 26 జిల్లాలకు.. 70 రెవిన్యూ డివిజన్లకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అందులో కుప్పం ను రెవిన్యూ డివిజన్ గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల సమయం నుంచి కుప్పం పైన వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొద్ది కాలం క్రితం జరిగిన స్థానిక సంస్థలు.. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం లో వైసీపీ గెలుపు జెండా ఎగురవేసింది.
Recommended Video
చంద్రబాబు చేయలేదని తాము చేసామంటూ..
ఇక, రాజకీయంగా మరింత పట్టు సాధించే క్రమంలో కుప్పం ను ఇప్పుడు రెవిన్యూ డివిజన్ గా ప్రకటించి.. చంద్రబాబు చేయలేనిది.. జగన్ చేసారనే ప్రచారం వైసీపీ నేతలు మొదలు పెట్టారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా మార్చి గిఫ్ట్ గా ఇచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. కుప్పంతో పాటుగా పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట,భీమవరం , ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి , ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయబోటి, పలమనేరు, శ్రీకాళహస్తి రెవిన్యూ డివిజన్లను ఖరారు చేసారు. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిని సైతం రెవిన్యూ డివిజన్ గా ప్రకటించారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్ వీటిని అధికారికంగా ప్రారంభించటంతో అక్కడ కార్యకలాపాలు మొదలు కానున్నాయి.