తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన; ప్రతీ ఇంటికి రూ.2500; రైతులకు భరోసా!!
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. తిరుపతి, బాపట్ల జిల్లాలలో ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి తుపాను ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు, బాధితులను పరామర్శించి భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని బాలిరెడ్డి పాలెంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మిచౌంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు.
స్వర్ణముఖి కాలువకు గండి పడిన ప్రాంతాలను కూడా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడిన జగన్ బాధిత రైతులను ఆదుకుంటామని చెప్పారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని, వారం రోజుల్లోగా సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వరుసగా వర్షాలతో రైతులు నష్టపోయారన్నారు.

విద్యుత్ సరఫరాను కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం మీకు సహాయం గా ఉంటుందని, బాధితులకు తోడుగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. స్వర్ణముఖి కాలువకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించానని తెలిపిన ఆయన భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ప్రభుత్వం మీది అని భావించండి.. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి బాధితులకు సహాయం అందకపోతే జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 1902 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. అక్కడ తన కార్యాలయం సిబ్బంది ఉంటారని, వారు మీ సమస్యలను పరిష్కరిస్తారని సీఎం జగన్ చెప్పారు .
తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తారని వెల్లడించారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న జగన్, వారం రోజుల్లోగా అందరికీ సహాయం చేస్తానని వెల్లడించారు. తుఫాన్ వల్ల రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తామని సీఎం జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications