సిట్టింగ్ల స్థానాలను మార్చనున్న సీఎం జగన్.. జాబితాలో పలువురు మంత్రులు, ఎంపీలు??
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలంటే గెలుపు గుర్రాలదే ప్రధాన బాధ్యత అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరాఖండిగా చెప్పేశారు. విజయం సాధించడానికి అవకాశాలున్న వ్యక్తులనే ఎమ్మెల్యేలుగా ఎంపిక చేస్తానని, పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ ను మెరుగుపరుచుకోవడానికి ఆరునెలల సమయం కూడా ఇచ్చారు. తాజాగా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను అదనపు సమన్వయకర్తగా నియమించడంద్వారా రాష్ట్రవ్యాప్తంగా పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలందరికీ సంకేతాలు పంపించినట్లవుతోంది.
హిందూపురం నుంచి ఉషాశ్రీచరణ్?
డొక్కాను నియమిచండంద్వారా రాబోయే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ లేదని జగన్మోహన్రెడ్డి చెప్పకనే చెప్పేశారు. డొక్కాకు ఎలాగైతే బాధ్యతలు అప్పజెప్పామో వ్యతిరేకత వ్యక్తమవుతోన్న మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇతరులకు బాధ్యతల అప్పగించేందుకు ముఖ్యమంత్రి సిద్దపడుతున్నారు. వీడియో కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో కల్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ను రంగంలోకి దింపాలనే ప్రయత్నాలు వైసీపీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పత్తికొండ నుంచి గోరంట్ల మాధవ్?
ఎంపీ గోరంట్ల మాధవ్కు పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉషాశ్రీ చరణ్ ను హిందూపురం పంపించి కల్యాణ దుర్గంలో కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి కుమార్తె పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లి నియోజకవర్గానికి పంపించి, అక్కడి నుంచి మంత్రిగా ఉన్న అంబటి రాంబాబును అవనిగడ్డకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం.
అవనిగడ్డ నుంచి అంబటి రాంబాబు?
సినీ నటుడు సుమన్ను రేపల్లె నియోజక వర్గం నుంచి పోటీచేయించేటట్లుగా పరిశీలన జరుగుతోందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆయన్ను వేమూరు నుంచి బరిలోకి దింపి మంత్రి మేరుగ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. మెజారిటీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను డిసెంబరుకల్లా పూర్తిచేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కసరత్తులు చేస్తున్నారు.