సీఎం జగన్ 2024 విజయం ధీమా వెనుక - ఆ నలుగురు...!!
తెలుగు రాజకీయ చరిత్రలో జగన్ కొత్త నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. రాజకీయంగా తొలి సారి వెనుకబడిన వర్గాల కోసం తన సంకల్పం ఏంటనేది బహిరంగంగానే చెబుతున్నారు. చేసింది చెప్పటతో పాటుగా ఏం చేయబోతున్నారో వివరించారు. బీసీలు బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదని..బ్యాక్ బోన్ అంటూ వారికి మరింత దగ్గరయ్యారు. మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు అంటూ అప్యాయత చూపించారు. సంక్షేమమే తమ పార్టీ ఫిలాసఫీ అని చెప్పిన సీఎం జగన్..బీసీలందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. వైసీపీ నిర్వహించిన జయహో బీసీ ఇప్పుడు రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.

తెలుగు రాజకీయ చరిత్రలో తొలి సారి..!!
సీఎం జగన్ నాడు ప్రతిపక్ష నేతగా ఏలూరు కేంద్రంగా బీసీ సభ నిర్వహించారు. ఆ సభలో చేసిన డిక్లరేషన్ కు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తరువాత నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. తొలి కేబినెట్ తో పాటుగా విస్తరణ తరువాత బీసీ మంత్రుల సంఖ్య 11కి పెరిగింది. ప్రభుత్వ - పార్టీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ -ఎస్సీ - ఎస్టీ - మైనార్టీ వర్గాలకు అన్ని పదవుల్లో - నామినేటెడ్ పనుల్లో 50 శాతం కేటాయించారు. స్పీకర్ పదవి బీసీ నేతకు కేటాయించారు. రాజ్యసభ పదవుల్లో ముగ్గురు బీసీలకు కేటాయించారు. వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభకు ప్రభుత్వం - పార్టీలోని మొత్తం 80, 582 మంది బీసీ నేతలు హాజరయ్యారు. ఇదే తరహా సభలు జిల్లాల- నియెజకవర్గం స్థాయిలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సమావేశం ద్వారా బీసీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది అర్దం అయింది. బీసీల్లో ఉన్న 139 కులాల గురించి సభా వేదిక మీద ప్రస్తావించారు. సీఎం జగన్ బీసీలు నిర్వహించే కులపనులను వరుసగా చెప్పుకొచ్చారు.

మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు
ఈ సభలో ముఖ్యమంత్రి మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు అంటూ బీసీలకు ఉన్న ప్రాధాన్యతను స్పష్టం చేసారు. ఏపీ కేబినెట్ లో బీసీ మంత్రులు మొదలు..పంచాయితీల్లో బీసీ వార్డు సభ్యుల వరకు అందరూ ఒకే వేదిక మీదకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సభలో ప్రతీ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుందని చెబుతూ.. వైసీపీ ఫిలాసఫీ సామజిక న్యాయం, బడుగు బలహీనుల సంక్షేమమేనని స్పష్టం చేసారు. వేల సంవత్సరాలుగా మన గ్రామం మన నాగరికతకు పట్టుగొమ్మలు బీసీలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. 2019 ఫిబ్రవరిలో ఏలూరు డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలను ఎలా నెరవేర్చామో ఒక్కసారి గమనించాలని కోరారు. ఆ డిక్లరేషన్లో బీసీ కులాలన్నింటికీ ప్రభుత్వ కార్పొరేషన్లు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీ గర్జనలో డిక్లరేషన్ చేశామని గుర్తు చేసారు. ఇచ్చిన మాట ప్రకారం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశానని ముఖ్యమంత్రి వివరించారు. గ్రామాల్లో నామినేషన్ పనుల్లో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 50 శాతం చేస్తున్నారన్నారు. పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ పథకానికి మూడున్నరేళ్ల కాలంలోనే అక్షరాల రూ.9,052 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

బీసీల మార్గదర్శి రూపకల్పన దిశగా...
జయహో బీసీ ఈ సభతో ఆగిపోదని..ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని వైసీపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. జిల్లాలు - నియోజకవర్గాల వారీగా సభలు - సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఆకాంక్షలను తెలుసుకోవాలని నిర్ణయించింది. బీసీల మార్గదర్శిని సిద్దం చేసుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. జయహో బీసీ విజయవంతం కావటంతో ఇక..జగన్ పదే పదే చెప్పే తన ఎస్సీ..తన ఎస్టీ వర్గాలకు చెందిన వారితోనూ ఇదే తరహా సభలకు నిర్ణయించారు. త్వరలోనే ఎస్సీ - ఎస్టీ సభలను నిర్వహించనున్నారు. తన వెనుక ఉన్నది నలుగరేనని చెబుతూ బీసీ -ఎస్సీ-ఎస్టీ -మైనార్టీ..పేదలేనని చెప్పారు. వారికి మద్దతుగా తాను నిలుస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు చంద్రబాబు సంపన్న వర్గాలకు..తన పేదల మధ్య జరిగే యుద్దంగా సీఎం జగన్ అభివర్ణించారు. దీని ద్వారా ముఖ్యమంత్రి జగన్ బీసీ -ఎస్సీ- ఎస్టీ - మైనార్టీ వర్గలకు తాను చేస్తున్న మంచిని గుర్తిస్తారని..తనకు మద్దతుగా నిలుస్తారని వారి మీద నమ్మకం ఉంచారు. త్వరలోనే మిగిలిన సభలకు ముహూర్తం ఖరారు కానుంది.












Click it and Unblock the Notifications