సాక్షి చూడట్లేదనే: సర్వేలపై ఎన్టీవికి సిఎం రమేష్ సవాల్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మంగళవారం ఎన్టీవి పైన నిప్పులు చెరిగారు. సర్వే ఫలితాల పైన ఆ టీవి ఛానల్కు సవాల్ విసిరారు. తప్పుడు సర్వేలతో క్రిమినల్కు మద్దతు తెలుపుతున్న వ్యవహారంపై తాము భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎన్టీవీలో వచ్చిన సర్వే రిపోర్టు బూటకమని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.
తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, తప్పని తేలితే ఎన్టీవిని మూసి వేసుకునేందుకు వారు సిద్ధమా అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 60కి పైగా స్థానాల్లో టిడిపి పోటీ లేకుండా గెలుస్తుందని, మిగిలిన ముప్పై సీట్లలో జగన్ పార్టీ పోటీ ఇస్తుందన్నారు. తమ పార్టీ కూడా సర్వేలు చేస్తోందని తెలిపారు. కానీ తాము బయట పెట్టడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న భయంతో సర్వే పేరిట కుట్ర చేస్తున్నారన్నారు. జగన్కు చెందిన సాక్షి టివిని ఎవరు చూడటం లేదని, ఆ టివి కథనాలను ప్రజలు పట్టించుకోవడం లేదని, అందుకే సాక్షి ఎన్టీవిని అద్దెకు తీసుకుందని ఆయన ఆరోపించారు. సర్వేలపై విచారణకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామన్నారు. సర్వేల్లో ఒక శాంపిల్ తీసుకోవాలంటే రూ.100 ఖర్చవుతుందని, లక్షల శాంపిళ్లు తీసుకున్నామని చెబుతున్నారు, అలా అయితే పదికోట్ల రూపాయల వరకు అవుతుందన్నారు.
అంత ఖర్చు ఎక్కడి నుండి పెట్టారో చెప్పాలన్నారు. గతంలో వైయస్ చనిపోయారని, జగన్ జైలులో ఉన్నందున షర్మిల, విజయమ్మలు రోడ్డెక్కారని సానుభూతితో ఓట్లు పడ్డాయని, ఇప్పుడు అలాంటి సానుభూతి లేదన్నారు. అందుకే సర్వే నాటకాలకు తెర లేపారన్నారు. బాబు రావాలి... జాబు వస్తుంది రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ పార్టీ పిఆర్పీ మాదిరి అయిపోయిందన్నారు. ఇప్పుడు సాక్షికి రేటింగ్ లేదని, ఆ టీవిలో వేస్తే నమ్మరని.. ఎన్టీవిని అద్దెకు తీసుకున్నారన్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జగన్ పార్టీ జీరో లేదా ఒకటి అని, తూర్పు గోదావరి జిల్లాలో రెండు మూడు వస్తాయని, కృష్ణాలోను అంతేనని, పశ్చిమ గోదావరిలో జీరో అని, ఏవైనా వస్తే రాయలసీమలో వస్తాయన్నారు. సర్వే కోసం కోట్లాది రూపాయలు ఎక్కడి నుండి తెచ్చారో చెప్పాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తుందని ఎన్టీవి కుట్ర చేస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికలపై ప్రాంతాల వారీగా సర్వేలు ప్రకటించే ధైర్యం ఎన్టీవికి ఉందా అని ప్రశ్నించారు.
కెవిపికి వాటాలు
వైయస్ ఆత్మ, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావుకు ఎన్టీవీలో వాటాలు ఉన్నాయని ఆరోపించారు. కెవిపినే గతంలో స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో ఎన్టీవి షేర్ల వివరాలు పేర్కొన్నారని చెప్పారు.