నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు, ట్రైనింగ్ అవసరం: డొక్కా, సీఎం రమేష్, ‘థర్డ్ఫ్రంట్ ముఖ్యం కాదు’
న్యూఢిల్లీ/అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం వైసీపీ ఎంపీ విజయసాయి సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్న వారు తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని విజయసాయిరెడ్డి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. తమకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కన్నా.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.
హోదాపై పోరాటం
ఢిల్లీలో సీఎం రమేష్ బుధవారం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటం విషయంలో ఏ రోజు కార్యాచరణ ఆరోజే ఉంటుందని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు
ఇది ఇలా ఉండగా, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి హితవు పలికారు. ఆయన తన మాట మార్చుకోవాలని సూచించారు.
విజయసాయికి ట్రైనింగ్ అవసరం
రాజకీయాల్లో ఉంటూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించే విజయసాయిరెడ్డి లాంటి వారికి ఒక ట్రైబ్యునల్ ప్రారంభించాలని, అందులో ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా మాట్లాడాలో 6నెలలపాటు ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కేంద్రానికి బుద్ధి చెబుతారు
ఏ పార్టీకి చెందిన నేతలు తప్పుగా మాట్లాడినా.. వారందరినీ ట్రైనింగ్కు పంపాలని డొక్కా అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగారకపోతే.. సరైన సమయంలో ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని చంద్రబాబు జాతీయ స్థాయికి తీసుకెళ్లారని అన్నారు.