పిఆర్పీ కంటే స్పీడ్గా: జగన్పై సిఎం, కిరణ్పై విహెచ్ ఫైర్
హైదరాబాద్/చెన్నై: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దుకాణం త్వరలో మూతబడే రోజులు ఉన్నాయని, చూస్తుంటే ప్రజారాజ్యం పార్టీ కన్నా వేగంగా మూతబడేలా కనపడుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్ ఆదివారం అన్నారు. జగన్ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని, తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. సీమాంధ్ర ప్రాంతంలోని ఆ పార్టీ నాయకులు చాలామంది బయటకు వచ్చారని, తమ పార్టీలో కూడా చేరేందుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ప్లీనరీలో చంద్రబాబు పైన విమర్శలు చేయడానికే పరిమితమయ్యారన్నారు.
జగన్ దోపిడీదారుల నాయకుడు అని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీఠం దిగితే కార్యకర్తకు కూడా పనికి రాని వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నైలో జరిగిన యువగర్జనలో ఆయన మాట్లాడారు. దోపిడీదారులు, జేబుదొంగలే జగన్ను నాయకుడిగా పేర్కొంటారన్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన చరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డిది అన్నారు. తెరాస నేత కెసిఆర్ పిల్లలు పదవులు అనుభవిస్తుంటే, మిగతా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిని చూసి కెసిఆర్ ఆనందిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రిపై విహెచ్
ముఖ్యమంత్రి నోరు తెరిస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో అబద్దాలే చెబుతున్నారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు విమర్శించారు. సోనియా గాంధీ విగ్రహాన్ని నాగర్ కర్నూలులో ప్రతిష్టించేందుకు పార్టీ నాయకుడు దిలీప్సాగర్ ఏర్పాటు చేయించిన విగ్రహాన్ని ఆదివారం గిరిజన మహిళలతో ఇందిరా పార్కు వద్ద ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఇక్కడే పెరిగినా ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు సహకరించమని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తన కుమారునికి చెప్పాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరని తెలిపారు.