తెరాసలో కలిపేందుకే: జగన్ను ఏకేసిన సిఎం
కడప/ అనంతపురం: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో కలిపేందుకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తహతహలాడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9, ఈటీవీలే కారణమని జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ అక్కసుతోనే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్లు ప్రసారం కాకుండా జగనే చేస్తున్నారా అని ప్రశ్నించారు.
గురువారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మీడియానే కారణమని జగన్ మాట్లాడడం ఆయన అవివేకమని ఆయన అన్నారు.. మీడియా వల్లనే టిడిపి అధికారంలోకి వచ్చిందని జగన్ మాట్లాడటం చూస్తే తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 చానళ్ల ప్రసారాలను కేసీఆర్ నిలిపివేయడానికి జగనే కారణమని చెప్పక తప్పదని సీఎం రమేశ్ అన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం చూస్తే జగన్-కేసీఆర్ మధ్య ఉన్న సంబంధాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో ఉన్న ఇలాంటి సంబంధాల కారణంగా తెలంగాణలో వైసీపీని తెరాసలో విలీనం చేసేందుకు జగన్ తహతహలాడుతున్నారని రమేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిచేసే శక్తిసామర్ధ్యాలు జగన్లో లేవని ప్రజలు గ్రహించే చంద్రబాబునాయుడును అధికారంలోకి తెచ్చారని రమేశ్ అన్నారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే అభివృద్ధి అంటే ఏమిటో టీడీపీ ప్రభుత్వం నిరూపించిందన్నారు. దీనిని ఓర్వలేక జగన్, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గోబెల్స్ ప్రచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఉనికి కోసమే జగన్మోహన్రెడ్డి పాట్లు పడుతున్నారని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. వందేళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులను చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల్లో చేసి చూపించిందన్నారు. గురువారం మంత్రి రఘునాథ్రెడ్డి 60వ జన్మదినోత్సవాన్ని తన నివాసంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతోందని, దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్రెడ్డి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. పార్టీని వీడిపోతున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకునేందుకే జగన్ తల్లడిల్లుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని జగన్ కోల్పోయారన్నారు. వారి విశ్వాసాన్ని చూరగొన్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడేనని చెప్పారు.