కేశినేనికి సీఎం రమేష్ కౌంటర్ : పార్టీలో లుకలుకలు సరిచేసుకోండి - వివాదంలో కొత్త టర్న్..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఎంపీ కేశినేని టీడీపీ మాజీ నేత..బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన ఇప్పుడు సీఎం రమేష్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ఒక ట్వీట్ చేసారు. అయితే, ఎక్కడా టీడీపీ..కేశినేని పేరు ఆయన ప్రస్తావించలేదు. కేశినేని నాని - కేశినేని చిన్ని ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. కుటుంబ వ్యవహారాలు రాజకీయ మలుపు తీసుకున్నాయి. ఈ క్రమం లోనే తన సోదరుడి పైన కేశినేని తన హోదాను.. తన కారు స్టిక్కర్ ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ లోక్ సభ కార్యదర్శికి.. రెండు రాష్ట్రాల డీజీపీలకు ఫిర్యాదు చేసారు.
కేశినేని వ్యాఖ్యలకు కౌంటర్
ఇక, ఇదే సమయంలో ఆయన ఆఫ్ ది రికార్డుగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. అందులో టీడీపీలో సీఎం రమేష్ పాత్ర గురించి ప్రస్తావించారు. టీడీపీలో.. చంద్రబాబు ఇంట్లో ఏం జరిగినా సీఎం రమేష్ కు వెంటనే తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ఎంపీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సైతం సీఎం రమేష్ కు వెంటనే తెలిసాయని చెప్పారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది జోస్యం చెప్పారు.
సీఎం రమేష్ ట్వీట్ తో పరోక్షంగా
2024 ఎన్నికల తరువాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. సీఎం రమేష్ ద్వారా ఆపరేషన్ జరుగుతుందంటూ తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. దీనికి కొనసాగింపుగా.. మరో ట్వీట్ చేసిన కేశినేని నాని కొద్ది రోజులు తనను బీజేపీలోకి..మరి కొద్ది రోజులు వైసీపీలోకి పంపించే బదులు పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టాలని అందులో ఎవరి పేరు ప్రస్తావించకుండా పోస్టింగ్ చేసారు. దీంతో పాటుగా యదార్ధ వాది లోక విరోధి అంటూ కామెంట్ చేసారు. కేశినేని వ్యాఖ్యలు..ఆయన సోషల్ మీడియా పోస్టు పైన టీడీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ సైతం తాజాగా ఒక ట్వీట్ చేసారు. అందులో కేశినేని పేరు ప్రస్తావించకపోయినా..ఆయన టీడీపీ ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలకు సమాధానం అనేది క్లియర్ గా కనిపిస్తోంది.
టీడీపీ ఎంపీ వివాదంలో కొత్త మలుపు
ఆ ట్వీట్ లో...."నాపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నాను. ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు, ఆధారాలు అవసరం లేదు.." అంటూ సీఎం రమేష్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీని ద్వారా ఇప్పుడు టీడీపీలో కేశినేని నాని పైన సైలెంట్ గా నేతలు కనిపిస్తున్నా.. ఇదంతా సైలెంట్ గానే జరుగుతున్న ఆపరేషన్ గా కేశినేని నాని అనుచరులు చెబుతున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో కేశినేని నాని రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. సీఎం రమేష్ చేసిన ట్వీట్ సైతం ఇప్పుడు వైరల్ గా మారుతోంది.