ఉద్యోగుల్లో సీఎం ప్రకటన టెన్షన్: విశాఖకు మారక తప్పదా..: నాటి ఇక్కట్లు గుర్తు చేసుకుంటూ..!
ముఖ్యమంత్రి జగన్ ప్రకటన..ఇప్పుడు ఉద్యోగుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ప్రధానంగా రాజధాని కేంద్రంగా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులతో పాటుగా హెచ్ఓడీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర విభజన సమయంలో..సమైకాంధ్ర కోసం ఉద్యోగులే కీలకంగా పోరాటం చేసారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా..ఆకస్మికంగా నాటి ముఖ్యమంత్రి అమరావతిగా రాజధాని ఖరారు చేసి..ఉద్యోగులను అక్కడి నుండి తరలించారు.
ఆ సమయంలో అనేక ఇబ్బందులు కుటుంబ సరంగా..ఉద్యోగ పరంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే సర్దుకుంటు న్నారు. సరిగ్గా ఇదే సమయంలో..మరోసారి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖగా ఉండవచ్చంటూ సీఎం చేసిన ప్రకటనతో..ఉద్యోగుల్లో మరోసారి కలకలం మొదలైంది. పరిపాలనా రాజధాని పేరుతో విశాఖకు మారితే దాదాపు 15 వేల మంది ఉద్యోగుల మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
సీఎం ప్రకటనతో...ఆందోళన
పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండవచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో చేసిన ప్రకటనతో ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన తరువాత పదేళ్లు హైదారబాద్ రాజధానిగా అవకాశం ఉన్నా..నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడగా అమరావతిని రాజధానిగా ప్రకటించి..ఉద్యోగులంగా అమరావతికి రావాల్సిందేనని స్పష్టం చేసారు. ఆ సమయం లో తమకు ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి నివేదించగా..నాడు శ్యాంబాబు.. జవహర్ రెడ్డిలతో కమిటీ వేసిన ప్రభుత్వం..ఉద్యోగులను ఒప్పించటానికి పలు నిర్ణయాలు తీసుకుంది.
అయినా..ఉద్యోగుల్లో అనేక మంది తమ కుటుంబాలు హైదరాబాద్ లో ఉంటున్నా.. తప్పని పరిస్థితుల్లో అమరావతికి తరలి వచ్చారు. ఇప్పుడు విశాఖకు తరలి వెళ్లాలనే వార్తలతో వారు నిజమేనా..తప్పదా అంటూ ఆరా తీస్తున్నారు.
నాడు ఉద్యోగులకు రాయితీలు..రైలు..
2016-17 లో ఏపీ ఉద్యోగులను హైదరాబాద్ నుండి అమరావతి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంది. వాటి ద్వారా వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా.. అయిదు రోజుల పని దినాలు.. కుటుంబాలను వదిలి పెట్టి ఒంటరిగా వచ్చిన వారికి విజయవాడలో ఉచితంగా వసతి కల్పించారు.
హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు సులువుగా ఉండేందుకు కేంద్రాన్ని ఒప్పించి కొత్త రైలు వేయించారు. ఇంటి అద్దె అలవెన్సును తాత్కాలికంగా పెంచి అమలు చేసారు. ఇప్పటికీ పలువురు ఉద్యోగులు శుక్రవారం సాయంత్రానికి అమరావతి నుండి వెళ్లి..రెండు రోజుల పాటు కుటుంబ సభ్యుల తో గడిపి..తిరిగి సోమవారం ఉదయానికి విధుల్లో చేరుతున్నారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం ఇక అమరావతి రాజధాని కదా అనే ఉద్దేశంతో.. గుంటూరు - విజయవాడ ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. కొందరు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు.
విశాఖ కు మారాలంటే..కష్టాలు తప్పవంటూ..
ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనతో తక్షణ, ప్రత్యక్ష ప్రభావం పడే ఉద్యోగుల్లో దీనిపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘ నేతల మీద ఒత్తిడి పెరుగుతోంది. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వచ్చిందని..కొత్త ప్రభుత్వంలో తమకు కష్టాలు ఉండవని భావిస్తుంటే..ఈ రకమైన నిర్ణయాలు ఏంటని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీని మీద ప్రభుత్వం నుండి స్పష్టత తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలను అభ్యర్ధిస్తున్నారు. అయితే, ఇప్పుడు జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి.. దీనిపైన ఉద్యోగులను నిజంగా విశాఖకు మార్చాల్సి వస్తే ఏ రకంగా ఒప్పిస్తారేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.