నా మనసుకు నచ్చిన పథకాలు ఇవే: వైఎస్ జగన్: రూ.9,274 కోట్లు ఖర్చు
అమరావతి: జగనన్న విద్యా దీవెన పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో విడత నిధులను విడుదల చేశారు. గత విద్యా సంవత్సరం అక్టోబర్-నవంబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లల్లో 709 కోట్ల రూపాయలను డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ రెండు పథకాలు..
విద్యాదీవెన, వసతి దీవెన సంక్షేమ పథకాలు తన మనసుకు నచ్చినవని, వాటిని అమలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని వైఎస్ జగన్ అన్నారు. వంద శాతం అక్షరాస్యతను సాధించడానికి ఈ పథకాలు దోహదపడతాయని అన్నారు. సంపూర్ణ అక్షరాస్యత ఉన్న సమాజంలో శిశు మరణాలు, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లుల మరణాలు కూడా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. సమాజం అన్ని విధాలుగా, అన్ని రంగాల్లోనూ ముందడుగు వేయడానికి సహాయపడేది చదువు మాత్రమేనని చెప్పారు.

చదువుకు పేదరికం అడ్డు కాకూడదు..
విద్యార్థుల చదువులకు పేదరికం అడ్డుకాకూడదనేది తన ఉద్దేశమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల పిల్లలు తమ చదువును మధ్యలోనే మాని వేయాల్సిన అవసరం ఎవరికీ రాకూడదనేది తాను గట్టిగా నమ్మిన సిద్ధాంతం అని వ్యాఖ్యానించారు. చదువుల కోసం అప్పులపాలయ్యే పరిస్థితి ఏ కుటుంబానికీ రాకూడదని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే పరిస్థితులు బాగుపడతాయని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చెబుతుండే వారని గుర్తు చేశారు.

వైఎస్ఆర్ రూపకల్పన చేసిన పథకం..
ఆ ఉద్దేశంతోనే ప్రతి పేద విద్యార్థికీ ఆర్థిక సహాకారాన్ని అందించడానికి ఫీజురీఎంబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేశారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద పిల్లల జీవితాలు మార్చాలని వైఎస్ఆర్ తాపత్రయ పడ్డారని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ ఇస్తున్నామని అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులకూ దీన్నిఅమలు చేస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వంలో అరకొరగా..
మెడిసిన్, ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు 20 వేల రూపాయలు, పాలిటెక్నిక్ చదివే వారికి 15 వేల రూపాయలు, ఐటీఐ విద్యార్థులకు 10 రూపాయలను సంవత్సరానికి రెండు విడతల్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫీజురీయింబర్స్మెంట్ను అరకొరగా మాత్రమే మంజూరు చేసేదని వైఎస్ జగన్ విమర్శించారు. 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజులు చెల్లించే పరిస్థితి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చింది 30 వేల రూపాయలు మాత్రమేనని అన్నారు.

బకాయిలను కూడా కట్టాం..
2017-18, 2018-19 సంవత్సరాలకు 1,778 కోట్ల రూపాయలను ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టిందని, వాటిని తాము చెల్లించామని వైఎస్ జగన్ అన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కోసం ఇప్పటి దాకా అక్షరాలా 9,274 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని అన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా, ఈ పథకంలో వారిని భాగస్వామ్యులను చేసినట్టయిందని చెప్పారు.

తల్లులను భాగస్వామ్యులను చేశాం..
తల్లులను భాగస్వామ్యులను చేయడం వల్ల- వారే వెళ్లి ఫీజులు కడుతున్నారని, ఫలితంగా కళాశాల యాజమాన్యంలో జవాబుదారీతనం పెరుగుతుందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కళాశాలల్లో వసతుల కొరత గురించి ప్రశ్నించే హక్కును తల్లులకు కల్పించామని అన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది పిల్లలను చదివించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ వర్తింపు, వసతి దీవెన ఎలాంటి నిబంధనలు లేవని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications