జనంలోకి జగన్: రూట్ మ్యాప్ ఖరార్..?!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నమ్మకం నువ్వే జగన్.. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగించింది. ఈ ప్రచార కార్యక్రమం కింద ప్రతి ఇంటినీ పలకరించింది. లబ్దిదారులను ముఖాముఖిగా కలుసుకుంది. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని ఆరా తీసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు.. ఇందులో విస్తృతంగా పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్.. అనే స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అతికించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల కింద మంజూరయిన నిధుల వివరాలతో కూడిన బ్రోచర్లను లబ్దిదారులకు అందజేశారు. ప్రభుత్వంపై వారిలో నెలకొన్న అభిప్రాయాలను సేకరించారు.

దీనికి కొనసాగింపుగా- వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. జిల్లాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఏడాది ముందు నుంచే ప్రజల మధ్యలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు పూనుకుంటోన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి చేస్తోంది.
మే చివరివారం నుంచి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలను చేపట్టే అవకాశం ఉంది. 26 జిల్లాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో కనీసం 10 రోజుల నుంచి 14 రోజుల వరకుక పర్యటించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేయడం, వాటి అమలు తీరును స్వయంగా పర్యవేక్షిస్తారని అంటున్నారు.
సంక్షేమ పథకాల నిధులను ఆయన జనం మధ్యే విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కో సంక్షేమ పథకం నిధులను విడుదల చేయడానికి ఒక్క జిల్లాలో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. జగనన్న విద్యా దీవెన పథక నిధులను అనంతపురం జిల్లా నార్పలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఇకపై ఇలాంటి కార్యక్రమాలు, సభలను ప్రతి నెలా, ప్రతి జిల్లాలోనూ ఏర్పాటయ్యేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటోంది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా రెండు వారాల పాటు మకాం వేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తరచూ జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తోన్నారు.












Click it and Unblock the Notifications