ఢిల్లీలో బిజీ బిజీగా జగన్: తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల కోసం..!!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. హస్తిన బాట పట్టారు. గురువారం సాయంత్రం ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. నేడు కూడా ఆయన అక్కడే ఉంటారు. ఢిల్లీ విమానాశ్రయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, మార్గాని భరత్ తదితరులు స్వాగతం పలికారు.
సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్తో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్ట్ బకాయిల విడుదల వంటి అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ నిధుల గురించి మరోసారి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి విడుదల చేయాల్సిన బకాయిల నిధుల వివరాలను అందులో పొందుపరిచారు.

ఆ సమయంలో జగన్ వెంట వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. నిర్మలా సీతారామన్కు శ్రీవేంకటేశ్వరస్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ను కలిశారు వైఎస్ జగన్.
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి ఆయన వద్ద ప్రస్తావించారు. ఆ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీ సరఫరా చేసిన విద్యుత్కు తెలంగాణ ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ ఉదయం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్వహించే వామపక్ష తీవ్రవాద నిర్మూలన అంశంపై జరగనున్న సదస్సుకు జగన్ హాజరవుతారు. ఆ తరువాత కూడా అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులనూ కలుస్తారు. ఈ భేటీ తరువాత ఆయన అమిత్ షాతో సమావేశమౌతారు.












Click it and Unblock the Notifications