వంగపండు ప్రసాదరావు కుమార్తె ఉషకు సీఎం జగన్ ఫోన్...
విప్లవ భావాలను తన పాటలతో తూటాలుగా పేల్చిన ప్రముఖ కవి,ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం(అగస్టు 5) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసాదరావు కుమార్తె ఉషను ఫోన్లో పరామర్శించారు.వంగపండు మృతితో ఓ ప్రజా గాయకుడిని కోల్పోయామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చరల్ కమిషన్కు ఉష చైర్ పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 77 ఏళ్ల ప్రసాదరావు విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. 1943లో జన్మించిన ఆయన ఉత్తరాంధ్ర జానపద శైలిలో పాటలు పాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన ఆయన విశాఖ షిప్ యార్డులో ఫిట్టర్గా పనిచేస్తూనే ప్రజా ఉద్యమాల్లో తన పాటను వినిపించారు. తర్వాతి కాలంలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయం ఉద్యమాలకే వెచ్చించారు. ప్రజా యుద్ద నౌక గద్దర్తో కలిసి జననాట్య మండలితో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన స్వయంగా రాసి,పాడిన ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. ఏం పిల్లో ఎల్దమొస్తవా.. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.