రైతులకు జగన్ కీలక హామీ- ఆర్బీకేల్లో ఇకపై..!!
అమరావతి: రాష్ట్రంలో అర్హులైన కౌలు రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు.
రైతు భరోసా కింద సీసీఆర్సీ కార్డులు పొందిన 1,46,324 మంది కౌలు రైతుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఒక్కో రైతుకు 7,500 రూపాయల చొప్పున మొత్తం ఈ పథకం కింద అందింది. ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద మరో 11 కోట్ల రూపాయలను ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద ఆర్థిక సాయాన్ని అందిస్తోన్నామని అన్నారు. 2023-24 సీజన్కు సంబంధించి కౌలు రైతుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని గుర్తు చేశారు.
రైతుకు నష్టం అనేది జరగకుండా 13 నెలల పాటు కౌలు రైతులకు సంబంధించిన సీసీఆర్సీ కార్డును గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. సీసీఆర్సీ కార్డు పొందిన కౌలు రైతులకు కూడా రైతు భరోసాతో పాటు మిగిలిన అన్ని ప్రయోజనాలు అందేలా చేస్తోన్నామని వివరించారు.
ఇప్పటివరకు సుమారు 5.28 లక్షల మంది కౌలు రైతులు, 3.99 లక్షల మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు 1,122 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ ద్వారా 52.50 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలను నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు.

రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలను అందిస్తోన్నామని జగన్ అన్నారు. ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని, భవిష్యత్తులో కియోస్క్, కల్తీ లేని విత్తనాలు, ఎరువులు సైతం ఆర్బీకేల నుంచి సరఫరా చేసే గొప్ప వ్యవస్థ గ్రామస్థాయిలోనే ఏర్పాటువుతుందని చెప్పారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications