ఆ మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం..
ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన 20 లక్షల మందికి జగన్ సర్కార్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దానిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న జగన్.. ఫలానా కలెక్టర్ అన్యాయంగా భూమి తీసుకున్నారనే మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదన్నారు. కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉందని.. యుద్దప్రాతిపదికన పనులు చేయాలని అధికారులను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి సీఎం కార్యదర్శుల నియామకం..
ఇళ్ల పట్టాల కోసం ఇప్పటికే గుర్తించిన భూముల్లో శరవేగంగా ప్లాట్లు అభివృద్ది చేయాలన్నారు జగన్. ఒకవేళ ప్లాట్లు ఇప్పటికే డెవలప్ చేసి ఉంటే.. లాటరీ పద్దతిలో లబ్దిదారులను ప్రకటించాలన్నారు. ఇంకా భూసేకరణ జరగని చోట త్వరగా భూమిని సమీకరించుకోవాలని ఆదేశించారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి వివిధ జిల్లాలకు సీఎస్ సహా సీఎం కార్యదర్శులను నియమిస్తున్నట్లు తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ప్రకాష్లకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించినట్టు చెప్పారు. అలాగే సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను, రాయలసీమ జిల్లాలను సీఎం కార్యదర్శి ఆరోకియా రాజుకు అప్పగించినట్టు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలను సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి అప్పగించామన్నారు. ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కలెక్టర్లు వీరిని సంప్రదించాలని జగన్ ఆదేశించారు.

పెన్షన్లు,రేషన్ కార్డులపై సమీక్ష
రీ వెరిఫికేషన్ తర్వాత ప్రభుత్వ పెన్షన్లు,రేషన్ కార్డుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. పెన్షన్ లబ్దిదారుల తుది జాబితాను రేపటి నుంచి శాశ్వతంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బియ్యం కార్డులకు సంబంధించి మూడు నాలుగు రోజుల్లో రీవెరిఫికేషన్ పూర్తి చేసి తుది జాబితా సచివాలయాల్లో ఉంచుతామన్నారు. సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి గ్రామ సచివాలయాల పరిధిలో ప్రతీ వలంటీర్కు యాభై ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్ చేయాలన్నారు. ఇందుకోసం హౌస్ హోల్డ్స్ సర్వే, మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. తద్వారా డోర్ డెలివరీ పద్దతి మరింత సులువు అవుతుందన్నారు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు.

దిశ చట్టం అమలుపై జగన్ ఆదేశాలు
ఇక దిశ చట్టంపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఆ చట్టం అమలుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. మార్చి 1 కల్లా అన్ని దిశ పోలీస్స్టేషన్లూ సిద్ధం కావాలన్నారు.బెల్టు షాపులు, అక్రమ మద్యం తయారీ వంటి వాటిపై ఉక్కు పాదం మోపాలన్నారు.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో బెల్టు షాపులు నడుస్తున్నట్టు సమాచారం ఉందని.. దానిపై దృష్టి సారించాలని ఆదేశించారు.

స్పందన కార్యక్రమంపై జగన్ సమీక్ష
స్పందన కార్యక్రమంపై కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో ప్రజలు లేవనెత్తే సమస్యలను కచ్చితంగా పరిష్కరించాలన్నారు. సమస్యలపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలకు కూడా అభ్యర్థనలు వెళ్లాలన్నారు. ప్రజలకు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలని.. నిర్లక్ష్యపూరితంగా వ్వవహరించవద్దని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications