మరో గుడ్ న్యూస్- 30న ఆ నిధులను విడుదల చేయనున్న వైఎస్ జగన్..!!
రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయన పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించారు. సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో ఎన్నికల ప్రసంగాలకూ దిగారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలన నచ్చితేనే ఓటు వేయాలంటూ వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోన్నారు.
జనం మధ్యే..
ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించారాయన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆక్వా వర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్కు శంకుస్థాపన చేశారు. దీనితో పాటు 1,400 కోట్ల రూపాయలతో వ్యయంతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు శిలాఫలకం వేశారు. సరిగ్గా రెండు రోజుల తరువాత ఉత్తరాంధ్ర గడ్డపై అడుగు పెట్టారు. నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష రెండో విడత పనులను లాంఛనంగా ప్రారంభించారు.
అన్నమయ్య జిల్లా..
ఇప్పుడాయన అన్నమయ్య జిల్లాలో పర్యటించడానికి సన్నద్ధం అయ్యారు. ఈ నెల 30వ తేదీన మదనపల్లికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి. నిజానికి ఈ నెల 25వ తేదీ నాడే వైఎస్ జగన్ బహిరంగ సభ షెడ్యూల్ అయింది గానీ- వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడింది. 24, 25 తేదీల్లో వాయుగుండం ప్రభావం ఉండటం వల్ల ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఈ పర్యటనను 30వ తేదీకి వాయిదా వేశారు.
నాలుగో విడతగా..
తన పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద విడుదల కానున్న నాలుగో విడత నిధులు ఇవి. ఇప్పటికే మూడు విడతల్లో విద్యా దీవెన పథకం కింద ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈపథకం కింద అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ను అందజేస్తోంది ప్రభుత్వం. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువకు అయ్యే ఖర్చును భరిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకి బదలాయిస్తోంది.
వారిద్దరిపై విమర్శలు..
అన్నమయ్య జిల్లా ఆవిర్భవించిన తరువాత ఇక్కడికి రాబోతోండటం వైఎస్ జగన్కు ఇదే తొలిసారి. ఈ సభను విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నవాజ్ భాష ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. మదనపల్లి ప్రభుత్వ కళాశాల గ్రౌండ్స్లో వైఎస్ జగన్ బహిరంగ సభను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మాటల దాడికి..
సాధారణంగా- వైఎస్ జగన్ తన బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు సంధిస్తుంటారు. ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడు అంటూ చురకలు అంటిస్తుంటారు. నరసాపురం, నరసన్నపేట సభల్లోనూ టీడీపీ, జనసేనపై విమర్శనాస్త్రాలను సంధించారు. మదనపల్లి సభలో ఆ మాటల దాడి కొనసాగే అవకాశం లేకపోలేదు.