జగన్ టాప్ గేర్: ఆ పథకం కింద నిధులు విడుదల: తొలిసారిగా ఆ జిల్లాలో ఎంట్రీ
మచిలీపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాప్ గేర్ వేశారు. సంక్షేమ పథకాలకు సమానంగా అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మంగళవారం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేపట్టిన ఆయన పలు సంస్థల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం సెజ్లో జపాన్కు చెందిన యోకహామా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్ల తయారీ యూనిట్ను ప్రారంభించారు.
ఇప్పుడు తాజాగా ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీన పెడనకు వెళ్లనున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తోటమూలలో ఏర్పాటు కానున్న బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మచిలీపట్నం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటైన తరువాత అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి.
ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోగి రమేష్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే కావడంతో వైఎస్ జగన్ పర్యటన, బహిరంగ సభ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయనతో పాటు తలశిల రఘురామ్, మాజీ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ రంజిత్, ఎస్పీ జోషువ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.
50 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. పెడన నియోజకవర్గం పరిధిలో 3,161 మంది వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్దిదారులు ఉన్నారు. వారందరూ సభకు రానున్నారు. మచిలీపట్నం, గుడ్లవల్లేరు, పెడన నుంచి పెద్ద ఎత్తున నేత కార్మికులను ఈ బహిరంగ సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. నేతన్న నేస్తం లబ్దిదారులతో ఫొటో సెషన్లో పాల్గొంటారు. దీనికోసం 20 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తోన్నారు.
Recommended Video
వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వైఎస్ జగన్ హెలికాప్టర్లో పెడనకు బయలుదేరి వెళ్తారు. 11:15 నిమిషాలకు బహిరంగ సభలో పాల్గొంటారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం తొలుత జెడ్పీ హైస్కూల్ ప్రాంగణాన్ని ఎంపిక చేసినప్పటికీ.. రైల్వే గేట్ ఇబ్బందులు ఉండటం వల్ల వద్దనుకున్నారు. మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.