గల్లంతైన బోటు ఆచూకీ లభ్యం.. ఏడుగురు మత్స్య కారులు సేఫ్.. సీఎం చంద్రబాబు హర్షం
కోనసీమ జిల్లాలో గల్లంతైన బోటు ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 3న సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్య కారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి మత్స్య కారులు వేటకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ నెల 17 నుంచి సముద్రంలో గాలింపు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. 10 రోజులపాటు కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ సిబ్బంది సముద్రంలో గాలించారు. అయితే ఆ ఏడుగురు మత్స్య కారులు పశ్చిమ బెంగాల్ తీరంలో సురక్షితంగా బయటపడ్జారు. ఇక పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన ఏడుగురిలో అంతా సురక్షితంగా ఉండడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరం శ్రమించిన గాలింపు బృందాలకు, అధికార యంత్రాంగానికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఏం జరిగిందంటే..?
ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఏడుగురు మత్స్య కారులతో కూడిన బోటు సముద్రంలోకి వెళ్లింది. అయితే సాకేంతిక లోపంతో పనిచేయక, గాలులకు వేరే ప్రాంతానికి కొట్టుకుపోయింది. నిర్ణీత గడువు దాటినా తిరిగి రాలేదనే విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు.. దీన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
స్వయంగా మంత్రులను పంపి గాలింపును పర్యవేక్షించారు. గల్లంతైన మత్స్య కారుల ఆచూకీ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని మార్గాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎం మూడు సార్లు సమీక్షించి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఏ మాత్రం నిరాశ చెందుకుండా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరిపింది. కోనసీమ తీరం నుంచి పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండొచ్చనే అంచనాతో పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్ విభాగాలను, అక్కడ స్థానికంగా ఉన్న శంకర్ పూర్ ఫిషింగ్ హార్బర్ మత్స్య కారులను అప్రమత్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల సహకారాన్ని కూడా తీసుకున్నారు.

అన్ని ప్రయత్నాలు ఫలించి శంకర్ పూర్ సమీపంలో బోటును, అందులోని ఏడుగురు మత్స్య కారులను రక్షించగలిగారు. అలాగే మత్స్య కారుల ఆచూకీ లభ్యమైన వెంటనే ఆ వివరాలను వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్య కారులను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.












Click it and Unblock the Notifications