ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎంఓతో చర్చలు : పీఆర్సీతో సహా పది అంశాలపైనా..!!
ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభిచింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు దసరా కానుకగా పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నారు. జీతాలు- పెన్షన్లు ఒకటో తేదీనే వచ్చేలా చూడాలని వినతి పత్రం సమర్పించారు. కొద్ది రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు ఇవే అంశాల పైన ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా, సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి కొన్ని డిమాండ్లు అమలు చేయాలని కోరారు.
పీఆర్సీ అమలు..డీఏల చెల్లింపు పైనే
అందులో ప్రధానంగా సీపీఎస్ రద్దు చేయాలని ... కరోనాతో మరణించిన ఉద్యోగుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకాకం ఎంపికైన ఒప్పందన ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలనేది మరో డిమాండ్. కాంట్రాక్టు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని అభ్యర్దించారు. ఆరోగ్య..విద్య..మున్సిపల్ శాఖల్లో ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలని ఈ వినతి పత్రాల్లో పేర్కొన్నారు. దీంతో..వీటి పైన నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి. .వాటికి ప్రభుత్వం పరంగా తీసుకొనే నిర్ణయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు.
అన్ని అంశాలపైన చర్చ
అందులో భాగంగా ఉద్యోగ సంఘాలను రావాలంటూ సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. ఉద్యోగులు పదవీ విరమణ చేసిన సమయంలో వారికి రావాల్సిన ప్రయోజనాలు సైతం ఆలస్యం అవుతున్న విషయం పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించారు. జీతాలు ఆలస్యం కాకుండా చూడాలని ప్రధానంగా వారు కోరుతున్నారు. ఇదే సమయంలో తాము ముఖ్యమంత్రిని కలిసి చర్చించే అవకాశం కల్పించాలని కోరారు. దీంతో..రెండు మూడు రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించేలా చూస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సజ్జల హామీ ఇచ్చారు.
కొన్ని సమస్యలకు పరిష్కార దిశగా
ఈ మేరకు తాజాగా జరిగే చర్చల్లో ఉద్యోగ సంఘాల వాదనలు విని..వాటిని అధికారులు సీఎంకు నివేదించే అవకాశం ఉంది. సీఎం నిర్ణయం మేరకు ఉద్యోగ సంఘాలను నేరుగా సీఎం వద్దకు తీసుకెళ్లి.. అక్కడ కొత్త నిర్ణయాలను ప్రకటించే విధంగా కసరత్తు జరుగుతోందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పీఆర్సీ అమలు చేయటం.. సీపీఎస్ పైన ప్రభుత్వం ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీని పైన ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం కానుంది.
Recommended Video
ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం
ఇక, ఉద్యోగులు కోరుతున్న ఇతర అంశాల పైన అధికారులు చర్చించి..వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లుగా సమాచారం. అయితే, ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ అమలు ఈ పండగ వేళ ప్రకటించాలనేది ఉద్యోగ సంఘాల వినతి. మరి..దీని పైన నిర్ణయం వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిందే. అదే విధంగా పెండింగ్ లో ఉన్న డీఏలను సైతం చెల్లించాలని కోరుతున్న సమయంలో..వీటి పైన అధికారులు హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.