‘మళ్లీ నువ్వే రావాలి’ కాన్సెప్ట్...బాగా ప్రచారం చేయండి:పార్టీ శ్రేణలకు చంద్రబాబు పిలుపు
Recommended Video
అమరావతి:ఒక వైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం సృష్టించిన నష్టాలని అధిగమించి రాష్ట్రాన్ని పురోగామి పథంలో నడపడాన్ని అన్ని వర్గాల ప్రజలూ హర్షిస్తున్నారని సిఎం చంద్రబాబు తెలిపారు.
బుధవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో టిడిపి బాధ్యులతో సమావేశం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. ఒక వైపు విభజన కష్టాలు, మరోవైపు కేంద్రం సృష్టించిన నష్టాలని అధిగమించి రాష్ట్రాన్ని పురోగామి పథంలో నడపడాన్ని అన్ని వర్గాల ప్రజలూ హర్షిస్తున్నారని తెలిపారు. 'మళ్లీ నువ్వే రావాలి' అనే కాన్సెప్ట్ ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. దీనిని సోషల్ మీడియాలో మరింత ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు.
సంతృప్తి...మరింత పెరగాలి
ప్రజల్లో సంతృప్తి ఇంకా పెరగాలని...ప్రభుత్వ సేవల్లో, పార్టీ సేవల్లో క్వాలిటీ బాగా పెరిగిందనే భావన వారిలో కలగాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జనంలో పూర్తిస్థాయి సంతృప్తి ఉందని చంద్రబాబు చెప్పారు...దానిని పార్టీపై సంతృప్తిగా మలుచుకోవడం నాయకులు, కార్యకర్తల బాధ్యతని చంద్రబాబు సూచించారు.
టీమ్ వర్క్...అద్భుత ఫలితాలు
వ్యవస్థలో ఒక్కరుగా ఎవరూ ఏదీ చేయలేరని, అదే బృందంగా పనిచేస్తే అద్భుత ఫలితాలొస్తాయని సిఎం చంద్రబాబు సూచించారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ యంత్రాంగం టీమ్ వర్క్ చేసినందువల్లే రాష్ట్రానికి 511 అవార్డులు వచ్చాయని సిఎం చంద్రబాబు తెలిపారు. అలాగే పార్టీలో కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే అద్భుత ఫలితాలు సాధించవచ్చని చంద్రబాబు అన్నారు.
సమన్వయంతో...పనిచేయండి...
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, ప్రజాసమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరిస్తూ ఉండాలని సిఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ క్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా మంత్రి, ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ లు అందరూ సమన్వయంగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇంకా 795 బూత్ కమిటీల కన్వీనర్లను నియమించలేదని.. వెంటనే నియమించాలని నిర్దేశించారు.
పార్టీ కార్యాలయానికి...ప్రతి మంత్రి
ప్రతి మంత్రి నెలలో రెండు రోజులు తప్పనిసరిగా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని...అక్కడ తమ శాఖల్లో సాధించిన పురోగతిపై చర్చించాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా పార్టీ బలహీనంగా ఉండరాదన్నారు. ఇది ఎన్నికల ఏడాది అని...మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు అన్నీ చేశామని...అలాగే చెప్పనవి కూడా చేశామని చంద్రబాబు చెప్పారు. ఇక పార్టీ నేతలు అన్ని విభేదాలను పక్కనపెట్టి ఘన విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
శిక్షణ...పని...విజయవంతం
పార్టీ కోసం 17 వేల మంది బూత్ కమిటీల కన్వీనర్లకు శిక్షణ ఇచ్చామని..మిగిలిన వారికీ ఇస్తామని...సెప్టెంబరు నాటికల్లా శిక్షణ కార్యక్రమాలు అన్నీ పూర్తిచేసి, బూత్ కమిటీ కన్వీనర్లకు పనులు అప్పగించాలని చంద్రబాబు సూచించారు. ఆ క్రమంలో వారి పనితీరును బట్టి ర్యాంకులిచ్చి ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే 10 వేల మంది బూత్ కమిటీల కన్వీనర్లు, సేవామిత్రలు, పార్టీ బాధ్యులతో సమావేశమవుతాను. రాష్ట్ర స్థాయిలో ప్రతి రోజూ మీడియా వార్తలపై విశ్లేషణ చేసినట్లే...జిల్లా స్థాయిలో కూడా విశ్లేషణ చేయాలని చంద్రబాబు సూచించారు. 25న కర్నూలులో నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట సదస్సు, 28న గుంటూరులో ‘నారా హమారా-టీడీపీ హమారా' మైనారిటీ సదస్సులను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు.