రాజమండ్రి ఘటనపై చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు: బోటులో డిజిపి
విశాఖపట్నం: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు కారణమని ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరం నేతలు ఆరోపించారు. రాజమండ్రి తొక్కిసలాటలో 27 మంది మరణించిన విషయం తెలిసిందే.
రాజమండ్రి ఘటనకు చంద్రబాబే బాధ్యుడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీసీపీ త్రివిక్రమవర్మకు ఫోరం నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పుష్కరస్నానం చేసేందుకు వచ్చి సాధారణ ప్రజలను అనుమతించడంలో జాప్యం జరిగినందువల్లే తొక్కిసలాట జరిగిందని అన్నారు.
రాజమండ్రి మంగళవారంనాటి తొక్కిసలాట నేపథ్యంలో భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏపీ డీజీపీ రాముడు బోటుపై పయనిస్తూ ఘాట్లలో భక్తుల రద్తీ, వారి భద్రతను సమీక్షించారు. మరోవైపు గోదావరి పుష్కరాల రెండో రోజు పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు గోదావరిలో పుణ్యస్నానమాచరిస్తున్నారు.
సమన్వయ లోపం వల్లనే...
అధికారులు, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం వల్లే పుష్కరఘాట్లో తొక్కిలాట జరిగిందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. అధికారులతో సమన్వయం చేసుకోవడంలో మంత్రి నారాయణ విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. బుధవారం ఉదయం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నారాయణ పరామర్శించారు.
కొనసాగుతున్న పుష్కర స్నానాలు
ఆంధ్రధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో రెండో రోజు బుధవారంనాడు పుష్కర స్నానాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురం, తెలంగాణలోని భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో తొక్కిసలాట నేపథ్యంలో ఏపీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పుష్కరాల సమాచారం కోసం 8333000020 టోల్ఫ్రీ ఫోన్లో సంప్రదించాలని అధికారులు కోరారు.