తొక్కిసలాట: చంద్రబాబుపై ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు, రాష్ట్రపతి సానుభూతి
న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి(ఎన్హెచ్ఆర్సీ) ఫిర్యాదు అందింది.
వీరరాఘవ రెడ్డి అనే న్యాయవాది చేసిన ఈ ఫిర్యాదును ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. పుష్కరాల తొక్కిసలాట ఘటనను నిలువరించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వీరరాఘవ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
రాష్ట్రపతి దిగ్ర్భాంతి
గోదావరి పుష్కరాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు అన్ని రకాల వైద్య సహాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
ఢిల్లీ పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ పర్యటన రద్దయింది. బుధవారం ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాట కారణంగా ఆయన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.
పుష్కరాలు ముగిసేవరకు రాజమండ్రిలోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని ఆయన ఉదయం స్పష్టం చేశారు. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు కూడా ఆయన ఆదేశించారు.