100 మీటర్ల దూరంలో..: చంద్రబాబు ఓటుపై గందరగోళం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఓటుపై గందరగోళం కొనసాగుతోంది. బాబు ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ చెప్పడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. ఇందుకు సంబంధించి టిడిపి పార్టీ కార్యాలయ కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ.. చంద్రబాబు పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చాక మాట్లాడారని చెప్పారు. ఆయన 100 మీటర్ల దూరంలో మాట్లాడినట్లు చెప్పారు.
బాబు ఎక్కడి నుండి మాట్లాడారో తాము భన్వర్ లాల్ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. బాబు ఓటు చెల్లదని భన్వర్ లాల్ ప్రకటించడం అభ్యంతరమన్నారు. ఈసి మద్యం, డబ్బు నియంత్రణ పైన దృష్టి సారించాలని వారు హితవు పలికారు. దీనిని తాము కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. భన్వర్ లాల్ తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావించారన్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు ఓటును చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ బుధవారం మధ్యాహ్నం చెప్పిన విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీకి ఓటేశానని చంద్రబాబు పోలింగ్ కేంద్రం వద్ద చెప్పడం ఈసి నిబంధనలకు విరుద్దమని చెప్పారు. నిబంధనను పట్టించుకోని చంద్రబాబు ఓటును చెల్లని దానిగా పరిగణిస్తామని చెప్పారు.
చంద్రబాబు మధ్యాహ్నం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్, బ్రాహ్మిణి, వసుంధరలు వచ్చి ఓటు వేశారు. ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ... టిడిపి, బిజెపి పొత్తులో భాగంగా తాను కమలం గుర్తుకు ఓటేశానని చెప్పడం సరికాదని చెప్పారు. అందుకే ఆయన ఓటును చెల్లని దానిగా పరిగణిస్తామని చెప్పారు.