ఏపీలో కరోనా కేసులపై పొంతనలేని లెక్కలు- ఒకరు మృతి చెందారన్న కేంద్రం..
ఏపీలో కరోనా వైరస్ బాధితులు, మరణాల సంఖ్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెలువరిస్తున్న గణాంకాలకు పొంతన కుదరడం లేదు. కేంద్రం ప్రకటనను బట్టి చూస్తే ఏపీలో ఇప్పటివరకూ 132 కరోనా పాజిటివ్ కేసులతో పాటు ఓ మరణం కూడా నమోదైనట్లు చెబుతున్నా.. రాష్ట్రంలో పరిస్ధితి దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ కరోనా మరణాన్ని సైతం దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిదనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతోంది.
ఏపీలో కరోనా బాధితులెందరు ?
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ రోజూ కనీసం రెండు నుంచి మూడు హెల్త్ బులిటెన్లను విడుదల చేస్తోంది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో క్వారంటైన్లో ఉన్న వారెందరు, వారిలో పరీక్షల అనంతరం పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య ఎంత, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య వంటి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అయితే ప్రభుత్వం హెల్త్ బులిటెన్లలో అందిస్తున్న వివరాలపై ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 161 మంది కరోనా పాజిటివ్ బాధితులను గుర్తించారు. వీరికి స్ధానికంగా ఉన్న పలు ఆస్పత్రులలో చికిత్స కొనసాగుతోంది.
మరణాలపై గందరగోళం..
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కానీ మరణాల సంఖ్య మాత్రం ఎక్కడా ప్రస్తావనకు రావడం లేదు. కానీ గతవారం విజయవాడ నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్లు పుకార్లు చెలగేరినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా దాన్ని నిర్ధారించిన దాఖలాలు లేవు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెబ్ సైట్లో మాత్రం ఏపీలో ఒకరు చనిపోయినట్లు సమాచారం ఉంచడంతో కలకలం రేగుతోంది.
కోలుకున్న వారెంత మంది ?
ఇదే కోవలో ఏపీలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారు ఎంత మంది అన్న విషయంలోనూ ఇదే సందిగ్ధత. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం నెల్లూరు, విశాఖ, కాకినాడలో ముగ్గురు కరోనా పాజిటివ్ గా తెలిన తర్వాత కోలుకున్నారు. వీరికి రెండుసార్లు పరీక్షల తర్వాత నెగెటివ్ రావడంతో ఇళ్లకు పంపించి హోం క్వారంటైన్ అందిస్తున్నారు. కానీ ఇప్పటికీ కేంద్రం మాత్రం ఏపీలో ఒకరు మాత్రమే కోలుకున్నట్లు చెబుతోంది. దీంతో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్ధితి.
Recommended Video
కేంద్రం, రాష్ట్రాల మధ్య గ్యాప్- విపక్షం విమర్శలు.
ఏపీలో కరోనా వైరస్ గణాంకాలపై ఇప్పటికే విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. కేంద్ర, రాష్ట్రాలు మాత్రం ఎక్కడా స్పందిస్తున్న సందర్భాలు లేవు. కానీ కేంద్రం, రాష్ట్రం వెలువరిస్తున్న గణాంకాల మధ్య గ్యాప్ పెరిగితే ప్రజల్లో సైతం అనుమానాలు పెరిగేలా కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రబుత్వం తక్షణం స్పందించి కచ్చితమైన వివరాలు ఇవ్వాలని విపక్షాలు కోరుతున్నాయి.