పవన్ కళ్యాణ్, వైయస్ జగన్.. ఛీ! కొట్టిన వారి కోసం ఆరాటం
విజయవాడ: విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ నేతలు వైసిపి అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు.
ఇరువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని ఛీకొట్టి దూరం పెయారు. అలాంటి నేతల కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదురు చూపు చూస్తోంది. జగన్, పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి ఆహ్వానిస్తే వస్తామని చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం తర్వాత వైయస్ జగన్ సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా ప్రతిపక్ష హోదా దక్కించుకున్నాడు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రాభవం కోల్పోయింది.
మరోవైపు, పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిగా ఉన్నారనే చెప్పవచ్చు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆయన తాను అన్ని పార్టీలకు సమాన దూరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారు.
ఇలా జగన్, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేవారిగా ఉన్నారు. అలాంటి వారి కోసం ఇప్పుడు ఆ పార్టీ అర్రులు చాస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. తమ పార్టీలో నాయకత్వ లేమి ఉందని అంటున్నారు. అందుకే వారి వైపు చూస్తున్నట్లుగా చెబుతోంది.
కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ చింతా మోహన్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిలు జగన్, పవన్ కళ్యాణ్ వస్తే ఆహ్వానిస్తామని, వారు రావొచ్చునని వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ నేత మాదాసు గంగాధరం కూడా అవే వ్యాఖ్యలు చేశారు. గంగాధరం మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటాలు చేస్తే తాము వెంట నిలబడేందుకు సిద్ధమని చెప్పారు.