కేవీపీ ప్రత్యేక హోదా బిల్లు: కాంగ్రెస్ విప్, మోడీ-బాబులు కార్నర్
న్యూఢిల్లీ/విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభ సభ్యుడు, తమ పార్టీ నేత కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుధవారం నాడు పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది.
ఈ నెల 22వ తేదీన కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు చర్చకు రానుంది. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయనుందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఇంతకుముందే చెప్పారు. ఈ రోజు విప్ జారీ చేశారు. హోదా పైన చర్చ, ఓటింగ్ సందర్భంగా పార్టీ సభ్యులు అందరూ కచ్చితంగా సభలో ఉండాలని ఆ విప్లో ఆదేశించింది.
మద్దతు కూడగడుతున్న రఘువీరా
కేవీపీ బిల్లు నేపథ్యంలో రఘువీరా రెడ్డి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తెరాస నేత కే కేశవ రావుకు ఫోన్ చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. దానికి కేకే కూడా సానుకూలంగా స్పందించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరోసారి లేఖ రాయనున్నారు. ఇదివరకే ఆయన బిల్లుకు మద్దతు పలకాలని లేఖ రాశారు. ఇప్పుడు మరోసారి లేఖ రాయాలని నిర్ణయించారు. జాతీయస్థాయిలో మిగతా పార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
విజయవాడలో యూత్ కాంగ్రెస్ ర్యాలీ
ప్రత్యేక హోదా బిల్లు చర్చకు రానున్న నేపథ్యంలో మరోసారి ఏపీలో ఈ అంశం రాజుకుంది. బుధవారం నాడు యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు.
కాగా, విభజన నేపథ్యంలో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదాతో పుంజుకోవాలని చూస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా పైన బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంది.
ఈ నేపథ్యంలో దీనిని క్యాష్ చేసుకొని, రాజకీయంగా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన బీజేపీ నెరవేర్చడం లేదని, మిత్రపక్షంగా ఉన్న టిడిపి డిమాండ్ చేయడం లేదని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. హోదాపై ప్రయివేటు బిల్లు, ఇప్పుడు సొంత సభ్యులకు విప్ జారీ చేయడం ద్వారా టిడిపి, బీజేపీలను కార్నర్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది.












Click it and Unblock the Notifications