YSRCP: మంత్రుల ఉపన్యాసాలను కుర్చీలు బాగా విన్నాయి!!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు చేసిన బస్సు యాత్రలో భాగంగా బహిరంగసభల్లో వారి ప్రసంగాలను కుర్చీలు బాగా విన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత చింతామోహన్ ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగాలనైతే కుర్చీలు ఇంకా బాగా విన్నాయన్నారు. ఈ ప్రభుత్వం అమలు చేసేది నవరత్నాలు కాదని, పనికిమాలిన రత్నాలని మండిపడ్డారు.
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన చింతా మోహన్ ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు చేసింది బస్సు యాత్ర కాదని.. తుస్సు యాత్ర అని, ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల ఉపకార వేతనాలను విడుదల చేయాలని, 87 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రయివేటు పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటామన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రెండునెలల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, అనంతరం కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేస్తుందన్నారు. అనంతబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉండకూడదని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దళిత ఉద్యమాలు బలహీనంగా జరుగుతున్నాయని, ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదని చింతామోహన్ స్పష్టం చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ఒక చిన్న జిల్లాకు పెట్టడం కాదని, దక్షిణ భారతదేశం మొత్తానికి ఆయన పేరు పెట్టి గౌరవించుకోవాలన్నారు. ఏపీలో సామాజిక న్యాయం జరగడంలేదని, సామాజిక అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.