సోనియాకి థ్యాంక్స్: జగన్, కెసిఆర్కు కౌంటర్ (పిక్చర్స్)
నిజామాబాద్: తెలంగాణ ప్రజల యాభయ్యారేళ్ల కల అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో జరిగిన జైత్రయాత్రలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొని సోనియా తెలంగాణ ఇచ్చారని ఇక తెలంగాణ ప్రజలు ఆమెకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీ పాలనతోనే తెలంగాణ పునర్మిర్మాణమని తెరాసకు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తమ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణంలో పాత్ర పోషిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.
2004, 2009 ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చినప్పుడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నేతలూ ఉన్నారని, అప్పుడు నోరుమెదపని నాయకులు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వారు సీమాంధ్ర కాంగ్రెసు నేతలను నిలదీశారు. మూడు ప్రాంతాలనూ సమానంగా చూడాల్సిన ఒక నాయకుడు తెలంగాణకు వ్యతిరేకినని ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు జై ఆంధ్ర అన్నవారే నేడు సమైక్యాంధ్ర అంటున్నారని, దీంట్లోని మర్మం, ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఉత్తరాది నుంచి వచ్చిన ఎంతోమంది హైదరాబాద్లో కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి లేని భయం సీమాంధ్రులకు ఎందుకని నేతలు ప్రశ్నించారు. సీమాంధ్రులు చేస్తున్న కథలకు తెలంగాణ ప్రక్రియ ఎప్పుడో వెనక్కి పోయేదని, సోనియా ఎంతో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని, సీమాంధ్రులు వెళితే తెలంగాణ ఇస్తాను మీకేం కావాలో చెప్పండి అని గట్టిగా వారికి చెప్పారని గుర్తు చేశారు.
జైత్రయాత్ర 1
సోనియా ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక దానికి తిరుగుండదని, తెలంగాణను ఎవ్వరూ ఆపలేరని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చెప్పారు.
జైత్రయాత్ర 2
ఉద్యమాల కారణంగా కొందరు నేతలు.. కొన్ని పార్టీలు పాలించే హక్కు మాకే ఉందనడం విడ్డూరంగా ఉందని, పాలించే హక్కు ఎప్పటికైనా కాంగ్రెస్కే ఉందని జానారెడ్డి అన్నారు.
జైత్రయాత్ర 3
తెలంగాణలోని ప్రతి ఇంటా సోనియాను దేవతలా కొలవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఉన్న వారిని ఎవరూ వెళ్లగొట్టరని, తెలంగాణలోని సీమాంధ్రుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి డీకే అరుణ భరోసా ఇచ్చారు.
జైత్రయాత్ర 4
జగన్ దీక్ష దొంగ దీక్షని, దీక్షలో ఉండగా 2 గంటల 20 నిమిషాలపాటు అదృశ్యమయ్యాడని, ఆ సమయంలో ఎక్కడికి వెళ్లాడో చెప్పాలని వి హనుమంత రావు డిమాండ్ చేశారు.
జైత్రయాత్ర 5
తన దీక్షకు బీజేపీ అగ్ర నేతలు వస్తారని, వారితో పొత్తు పెట్టుకోవచ్చని చంద్రబాబు చూశారని, వారెవరూ రాకపోగా బాబా రాందేవ్ మాత్రం వచ్చారని, ఇక నుంచి చంద్రబాబు ఊరురా తిరుగుతూ యోగాసనాలు వేయాల్సి వస్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.