కిరణ్ రెడ్డిపై కాంగ్రెసు మూకుమ్మడి మాటల దాడి
హైదరాబాద్: భవిష్యత్తు కార్యాచరణపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు తన మద్దతుదారులతో సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు ఆయనపై మూకుమ్మడి మాటల యుద్ధానికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసుకు రాజీనామా చేసిన కిరణ్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం సాగుతోంది. ఆయన అందుకుగాను ఆదివారంనాడు కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యులతో, తన వర్గం శాసనసభ్యులతో సమావేశం కానున్నారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వారం, పది రోజుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతూ వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల ఫలితం ఉండదని, తాను చెప్పిన విధంగా సిడబ్ల్యుసి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పుడే రాజీనామా చేసి ఉంటే విభజన ఆగి ఉండేదని ఆయన అంటూ వచ్చారు.
విభజన విషయంలో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతూ వచ్చారు. చివరి బంతి ఉందంటూ కిరణ్ కుమార్ రెడ్డి చెబుతుంటే తాము నమ్ముతూ వచ్చామని ఆయన అన్నారు. తాజా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు చాలా కాలంగా కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పడుతూ వస్తున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి బాలరాజును తన సమావేశాలకు ఆహ్వానించడం కూడా మానేశారు.
గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాద్ గత కొద్ది రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు మాత్రమే పెడతారని, పార్టీ పెట్టబోరని ఆయన అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు నుంచి కూడా ఆయన వద్దకు ఒక్క శాసనసభ్యుడు కూడా రాబోడని ఆయన శనివారంనాడు అన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన రఘువీరా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సమయంలో కాంగ్రెసును వదిలిపెట్టేవారు పిరికిపిందలని ఆయన వ్యాఖ్యానించారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఎవరు వదిలిపోతే వారు అని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజలు క్షమించరు
రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు పార్టీని సీమాంధ్ర ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. బహిష్కృత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు అందరూ ఆదివారం కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమవుతారని ఆయన అన్నారు. తామంతా ఈ నెలాఖరుకు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని చెప్పారు. కాంగ్రెసు, బిజెపి రెండూ కలిసి రాష్ట్రాన్ని విభజించాయని ఆయన విమర్శించారు.